కోటగిరి, డిసెంబర్ 14 : మండలకేంద్రంలోని అయ్యప్ప, సాయిబాబా సన్నిధానం ఆవరణలో అయ్యప్పస్వామి సామూహిక మహా పడిపూజ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు, అర్చకులు గణపతి, కుమారస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు పడిపూజకు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపాటలు, సంకీర్తనలు ఆలపించారు.
అయ్యప్ప నామస్మరణతో కోటగిరి మార్మోగింది. గురుస్వాములు బీర్కూర్ గంగాధర్, శివకుమార్.. ఇతర గ్రామాల నుంచి వచ్చిన గురుస్వాములను ఘనంగా సన్మానించారు. అయ్యప్ప సేవాసమితి కోటగిరి ఆధ్వర్యంలో మాలధారులు పూజలు చేసి మహాపడిని వెలిగించారు. అనంతరం మాలధారులు, భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. మహాపడి పూజకు సహకరించిన దాతలను సేవాసమితి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో గురుస్వాములు పి.సాయిలు, పొతంగల్ సూదం శంకర్, రాధాకృష్ణ, వర్ని సుబ్రహ్మణ్యం, గంగారాం, లింగం, సతీశ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.