ఖలీల్వాడి, నవంబర్ 29 : ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలని ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జనవరి 10 నాటికే డబుల్ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణంతో పాటు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం డ్రైనేజీ, అప్రోచ్ రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. అదే సమయంలో నిబంధనలకనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవోల నేతృత్వంలో వారిని భాగస్వాములు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తుల సమగ్ర వివరాలను ప్రత్యేక రిజిష్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు.
మూడు రోజుల పాటు కార్యదర్శులతో దరఖాస్తులు స్వీకరించి, వాటిని తమకు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. దరఖాస్తులను తాము ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని, అక్కడి నుంచి ఆమోదం లభించిన మీదట ఇండ్ల సంఖ్య కన్నా లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 3031 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, తుది దశలో ఉన్న మిగతా 3849 ఇండ్ల నిర్మాణాలను సైతం జనవరి 10 వ తేదీలోపే పూర్తి చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని, నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సమకూర్చుకునేందుకు తోడ్పాటునందించాలని తహసీల్దార్లకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పనులు పూర్తయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ జరపాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, ఆర్డీవో రవి పాల్గొన్నారు.