నిజామాబాద్ రూరల్, నవంబర్ 27 : నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమం అంచెలంచెలుగా అభివృద్ధి చెందున్నది. ఈ ఆశ్రమ ఆవరణలో నిర్మించిన శివాలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నది. సోమవారం ఆశ్రమ 13వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వార్షికోత్సవం సందర్భంగా సోమవారం వంద జంటలతో శివుడి విగ్రహానికి అభిషేకం, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలను ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
24 ఏండ్ల క్రితం స్థాపన..
ఆహ్లాదకర వాతావరణంతో లింగేశ్వర గుట్ట ఆశ్రమాన్ని పిట్ల కృష్ణ మహరాజ్ 24 ఏండ్ల క్రితం మల్లారం శివారులో స్థాపించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో తొలుత చిన్నపందిరి వేసి సాధన ప్రారంభించిన పిట్ల కృష్ణ మహరాజ్.. అనంతరం శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు చేస్తూ వచ్చారు. భక్తుల రాకపోకలు ప్రారంభం కావడంతో ఆశ్రమం రోజురోజుకూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆశ్రమ ఆవరణలో శివాలయంతోపాటు దత్తాత్రేయ, కాలభైరవ, నటరాజ, అమ్మవారి ఆలయాలున్నాయి. ఇక్కడికి దర్శనం కోసం వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేకంగా మహరాజ్ కార్తిక మాస దీక్ష
లోక కల్యాణార్థం ప్రతి ఏడాది పిట్ల కృష్ణ మహరాజ్ కార్త్తికమాస దీక్ష చేపడుతారు. ఈ దీక్ష పవిత్రమైన కార్తికమాసంలో ప్రత్యేకంగా నిలిచి భక్తులకు స్ఫూర్తినిస్తున్నది. దీక్ష అనంతరం భక్తులతో కలిసి బాసరలోని సరస్వతీ ఆలయం వరకు, కందకుర్తి త్రివేణి సంగమం వరకు మహరాజ్ భక్తులతో కలిసి పాదయాత్రగా వెళ్లి గంగహారతినిచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
గోశాలలో సుమారు 200 ఆవులు
ఆశ్రమంలోని గోశాలలో సుమారు 200 ఆవులున్నాయి. గోశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. భక్తులు ఈ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు గోపూజలు నిర్వహించటానికి ఇక్కడి గోశాల ఎంతగానో ఉపయోగపడుతున్నది.
పర్వదినాల్లో సందడి వాతావరణం
మహాశివరాత్రితోపాటు ఇతర పర్వదినాల్లో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ పర్వదినాల్లో నిజామాబాద్ జిల్లాతోపాటు నిర్మల్, కామారెడ్డి, మెదక్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తారు. ఆశ్రమంలో ఇప్పుడున్న 20 వేల లీటర్ల నీటిసామర్థ్యం ట్యాంకు ద్వారా తాగునీటి సరఫరా సరిపోవడం లేదు. 60 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో వాటర్ ట్యాంకు నిర్మించాలని ఆశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి వాటర్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు. ఆశ్రమానికి వెళ్లే మట్టి రోడ్డు స్థానంలో కొంతవరకు సీసీ రోడ్డు వేశారు. మిగిలి ఉన్న రోడ్డును కూడా సీసీ రోడ్డుగా మార్చాలని కోరుతున్నారు.
భక్తుల సహకారంతోనే ఆశ్రమ అభివృద్ధి
భక్తులందిస్తున్న సంపూర్ణ సహకారంతోనే ఆశ్రమం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నది. 24 ఏండ్ల కిందట చిన్న పందిరితో సాధన ప్రారంభించాను. అనంతరం ఏర్పాటు చేసిన శివాలయ దర్శనం కోసం భక్తుల భక్తుల రాకపోకల సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి.
– పిట్ల కృష్ణ మహరాజ్, ఆశ్రమ వ్యవస్థాపకులు