లింగంపేట, నవంబర్ 27: గ్రామాల్లో రైతుల ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించింది. మండలంలోని ఆయా గ్రామాల్లో సహకార సంఘం, సెర్ప్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన ధాన్యం దళారుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వాలు మండలంలోని 16 పంచాయతీల పరిధిలో మూడు నుంచి ఐదు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసేవి. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల్లో విరివిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరను చెల్లిస్తున్నారు. డబ్బుల కోసం ఎదురుచూడకుండా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో రైతుల కష్టాలు తీరాయి. అప్పట్లో రైతులు ధాన్యం విక్రయించడానికి సరిపడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి.
ధాన్యం కొనుగులు చేసిన వ్యాపారులు డబ్బులు సకాలంలో అందించకపోవడంతో ధాన్యం డబ్బుల కోసం వారి చుట్టూ ప్రదక్షినలు చేసేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు పోయాయి. మండలంలోని నల్లమడుగు సహకార సంఘం ఆధ్వర్యంలో నల్లమడుగు, కోర్పోల్, బాణాపూర్ గ్రామాల్లో, శెట్పల్లిసంగారెడ్డి సహకారం సంఘం ఆధ్వర్యంలో శెట్పల్లిసంగారెడ్డి, ఎక్కపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెర్ప్ అధికారులు పోల్కంపేట, కన్నాపూర్ గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేయగా.. లింగంపేట సహకార సంఘం వారు ఐలాపూర్, పోతాయిపల్లి, లింగంపల్లి, శెట్పల్లి, భవానీపేట, జల్దిపల్లి, లింగంపేట, ముంబాజీపేట, బోనాల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 15కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు రవాణా భారం తగ్గింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వేలాది క్వింటాళ్ల ధాన్యం సేకరించిన అధికారులు రైతుల కష్టాలను తీర్చారు. రైతులకు ధాన్యం డబ్బులు సైతం నాలుగు నుంచి వారం రోజుల వ్యవధిలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో వారి ఇబ్బందులు అన్నీ తొలిగిపోయాయి.
రైతుల కష్టాన్ని గుర్తించి కేంద్రాల ఏర్పాటు..
ధాన్యం విక్రయించడానికి రైతులు పడ్డ కష్టాన్ని గుర్తించాం. నాకు వ్యవసాయం ఉంది రైతులు కష్టాలు స్వయంగా చూశాను. రైతులు పండించిన ధాన్యం డబ్బులు సకాలంలో అందక పోవడం, ధా న్యం విక్రయించడానికి గ్రామాల నుంచి మండల కేంద్రానికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైతులకు ధాన్యం రవాణా భారం తగ్గించడానికి గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశాం. లింగంపేట సహకార సంఘం పరిధిలో కేవలం మూడు కేంద్రాలు మాత్ర మే ఉండేవి. వాటిని ఎనిమిది కేంద్రాలకు పెం చాం. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తా.
– దేవేందర్రెడ్డి, సహకార సంఘం, చైర్మన్