ఖలీల్వాడి, నవంబర్ 25 : బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని శిశు సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి అన్నారు. నగరంలోని ప్రభుత్వ దవాఖానలో శిశు సంక్షేమశాఖ, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు బాగా చదువుకోవాలని, చట్టాలపై ఇతరులకు అవగాహన కల్పించేలా ఉండాలని అన్నారు. బాలికలు, మహిళలు హింసకు గురైతే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 181కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, బాలికలపై హింసను నిరోధిద్దాం
స్త్రీ, పురుష అంతరాలు లేని సమాజ వికాసానికి, మహిళలు, బాలికలపై హింస నిరోధానికి పాటుపడుదామని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజ్కుమార్ సుబేదార్ పిలుపునిచ్చారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో మహిళలు, బాలికలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినాన్ని వర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మహిళలపై ఏ రూపంలో హింస జరిగినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని, మహిళలపై వివక్షను అంతం చేయాలని అన్నారు. వర్డ్ స్వచ్ఛంద సంస్థ కార్యవర్గసభ్యుడు, సీనియర్ న్యాయవాది ఆశ నారాయణ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సంరక్షణ కోసం భారత పార్లమెంట్, రాష్ర్టాల శాసనసభలు ప్రత్యేక చట్టాలను రూపొందించి అమలుచేస్తున్నాయని తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్లు, వరకట్న నిరోధక, పోక్సో చట్టం, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, వివక్ష చట్టం, బాలికల వివాహ నిరోధక చట్టంతో పాటు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇందూర్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శోభ, కోశాధికారి మాలతి, కార్యదర్శి కవిత, ఉపాధ్యాయురాలు గంగమణి, సహాయకార్యదర్శి గంగలక్ష్మి, వర్డ్ సభ్యులు సుమలత, కిరణ్మయి, రాజేందర్, నరేశ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.