ఇందల్వాయి, నవంబర్ 25: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. ఇప్పటికే 48 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు, తాగునీరు, విద్యుత్ వసతి, డ్రైనేజీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే జనవరి 15, సంక్రాంతి పండుగ నాటికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ నెలాఖరు నాటికే అన్ని పనులను పూర్తి చేసేలా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. నిబంధనలకనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. వారికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో జరగాలన్నారు.
అందుబాటులో ఉన్న ఇండ్ల నిర్మాణాల కన్నా లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న పక్షంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. మిగతా వారికి తదుపరి విడుతలో అర్హులైన లబ్ధిదారులుగా పరిగణిస్తామన్నారు. పోడుభూముల దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సర్పంచ్ పాశం సత్తెవ్వ, ఉపసర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ సుధాకర్ విన్నవించారు. స్పందించిన కలెక్టర్ ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కలెక్టర్ వెంట డీసీవో సింహాచలం, తహసీల్దార్ రోజా, కార్యదర్శి భరత్, గ్రామస్తులు ఉన్నారు.