నిజాంసాగర్, నవంబర్ 21: రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా.. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించడంతో పాటు మద్దతుధర పొం దే అవకాశాలు ఉంటాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రైతులకు మంచి రోజులు వచ్చాయని, వారు తలెత్తుకొని జీవించేలా కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. జుక్కల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్ పది ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న ఆయిల్ పామ్ పంటను విశ్వతేజ కంపెనీ ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతు పెట్టుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఉచిత విద్యుత్, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారన్నారు. పలు పంటలను సాగుచేయడంతో అధిక లాభాలు గడిస్తారని, మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ యశోదా నీలూపటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్. జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీబాయి దాదారావు పటేల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మాధవ్రావ్దేశాయ్, వైస్ ఎంపీపీ ఉమాకాంత్, సర్పంచులు రవిపటేల్, హన్మాండ్లు, శివాజీపటేల్ తదితరులు పాల్గొన్నారు.