మోర్తాడ్, నవంబర్ 21 : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చూస్తున్నది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు-మన బడి’ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించేందుకు పెద్దపీట వేస్తున్నది. అదే సమయంలో విధులను ఎగ్గొడుతున్న ఉపాధ్యాయులకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇ ప్పటికే కొన్ని జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు వి ధానం తీసుకొచ్చింది. మరోవైపు, నిజామాబాద్ జిల్లాలో ‘జియా అటెండెన్స్ యాప్’ను అమలు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలనిస్తున్నది. దీని ద్వారా టీచర్ల హాజరు శాతం పెరగడంతోపాటు డుమ్మా మాస్టర్ల ఆగడాలకు చెక్ పడినట్లయ్యింది. యాప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఉపాధ్యాయులు సమయానికి రావడం, నిర్దేశిత టైమ్ తర్వాతే ఇంటికి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి.
1765 స్కూళ్లు.. 4908 మంది టీచర్లు
జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న జియో అటెండెన్స్ విధానంతో ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగింది. జిల్లాలో 824 ప్రాథమిక, 367 ప్రాథమికోన్నత, 574 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1765 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 4,908 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 2,81,154 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇంత మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. అయితే, వీరిలో కొందరు విధులకు ఎగనామం పెట్టి వేరే వ్యాపకాల్లో తిరిగేవారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీచర్లు ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 వరకూ, హైస్కూళ్లలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ టీచర్లు తప్పకుండా విధుల్లో ఉండాల్సిందే. కానీ చాలా మంది సమయ పాలన పాటించే వారు కాదు.
ఆలస్యంగా బడికి..
జియో అటెండెన్స్ విధానం రాక ముందు చాలా మంది టీచర్లు ఇష్టమొచ్చిన సమయానికి స్కూల్కు వచ్చేవారు. చాలా మంది ఉపాధ్యాయులు జిల్లా, డివిజన్ కేంద్రాల్లోనే ఉంటున్నారు. వారు పని చేస్తున్న పాఠశాల ఏ మారుమూలకో ఉంటుంది. వారు స్కూల్కు చేరుకునే సరికి ఉదయం 10 గంటలు దాటేది. మరోవైపు, పాఠశాల సమయం ముగియక ముందే వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ చాలా మంది టీచర్లు వెళ్లిపోయే వారు. మరికొందరేమో వివిధ వ్యాపారాలు చేస్తూ పాఠశాలలో సరిగా ఉండేవారు కాదు. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా, ముందే వెళ్లి పోయినా హెడ్మాస్టర్లు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఏమంటే ఏమనుకుంటారోననే భావనతో సతమతమయ్యే వారు.
సత్ఫలితాలనిస్తున్న జియో అటెండెన్స్
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న జియో అటెండెన్స్ విధానంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. చాలా మంది ఉపాధ్యాయులు బడికి ఆలస్యంగా రావడం, నిర్దేశిత సమయానికన్నా ముందే వెళ్లి పోయేవారు. కానీ, నూతన హాజరు విధానం ఇలాంటి వాటికి చెక్ పెట్టింది. సమయానికన్నా ముందే పాఠశాలలకు రావడం, నిర్దేశిత సమయం ముగిసిన తర్వాతే ఇంటికి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. జియో అటెండెన్స్ విధానంలో భాగంగా టీచర్లు సమయానికే పాఠశాలకు చేరుకొని జియో అటెండెన్స్ యాప్లో ఫొటో దిగి హాజరు నమోదు చేసుకోవాలి. వెళ్లే సమయంలోనూ ఇదే విధానాన్ని పాటించాలి. సమయంలో ఏమాత్రం తేడా ఉన్నా సంబంధిత యాప్ ఉపాధ్యాయుడి అటెండెన్స్ తీసుకోదు. ఆలస్యంగా వచ్చిన సగం రోజు విధుల్లో లేనట్లుగానే సూచిస్తుంది. దీంతో డుమ్మా మాస్టర్లకు చెక్ పడింది. యాప్ కారణంగా టీచర్లంతా కచ్చితంగా సమయ పాలన పాటిస్తున్నారు.
అద్భుత ఫలితాలు..
జిల్లాలో జియో అటెండెన్స్ యాప్ను అక్టోబర్ 15న విద్యాశాఖ ప్రారంభించింది. 15 రోజుల పాటు ఈ యాప్కు సంబంధించి ఉపాధ్యాయులకు నేర్చుకునే అవకాశం ఇచ్చారు. నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ విధానంతో పాఠశాలల్లో సమయ పాలన పాటించని, డుమ్మా కొట్టే ఉపాధ్యాయులు సైతం తమ పనితీరులో మార్పులు చేసుకోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.
త్వరలో బయోమెట్రిక్ విధానం..
ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జియో అటెండెన్స్ యాప్ మంచి ఫలితాలను ఇస్తున్నది. మరోవైపు, త్వరలోనే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు జిల్లాలోని చాలా మండలాలకు ఇప్పటికే బయోమెట్రిక్ డివైజ్లు చేరుకున్నాయి. త్వరలోనే బయోమెట్రిక్ మెషిన్లను అమర్చి, వాటి ద్వారా హాజరు నమోదు విధానం అమలు చేయనున్నారు.
పరిపాలన సులభమయ్యింది..
జియో అటెండెన్స్ విధానంతో పరిపాలన సులభతరమయ్యింది. టీచర్లంతా సమయంలోగా పాఠశాలకు రావడం, నిర్దేశిత సమయం ముగిసిన తర్వాతే స్కూల్ నుంచి వెళ్తున్నారు. ఏ ఉపాధ్యాయుడు పాఠశాలకు ఎంత సమయం ముందు వచ్చాడు, ఏ టీచర్ ఆలస్యంగా వచ్చారో నిత్యం హెడాఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతుంది.
– ఆంధ్రయ్య, ఎంఈవో, మోర్తాడ్
హాజరు శాతం పెరిగింది..
జియో అటెండెన్స్ విధానం వల్ల ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా 80 శాతానికి పైగా హాజరు నమోదవుతున్నది. కొత్త విధానంతో టీచర్లు పాఠశాలను విడిచి బయటికి వెళ్లే అవకాశం లేదు. బడికి ఆలస్యంగా వస్తే సగం రోజు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఆ భయంతోనే టీచర్లు సకాలంలో పాఠశాలలకు వస్తున్నారు. నిర్దేశిత సమయం వరకు పాఠశాలలోనే ఉంటున్నారు.
– దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్