కమ్మర్పల్లి, నవంబర్ 3 : రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిరుద్యోగ యువత వెన్నుతట్టి ప్రోత్సహించి ఉద్యోగాల సాధనకు బాటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్తో సిద్ధమవు తున్న అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో ఉచితంగా కోచింగ్ సెంటర్, కోచింగ్ పొందిన అభ్యర్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనం, అభ్యర్థులకు విలువైన ప్రిపరేషన్ మెటీరియల్, అన్ లైన్ కోచింగ్ యాప్ సేవలు అందించి అండగా నిలిచారు.
ఇలా ఆయన అందించిన అండతో ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షలో ఏకంగా 730 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యి మెయిన్స్కు అర్హత సాధించారు. క్వాలిఫై అయిన అభ్యర్థులు మంత్రి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమ సొంత అన్న లాగా, కుటుంబ సభ్యుడి లాగా ఎంతో ప్రేమతో వెన్ను తట్టి ప్రోత్స హించారని.. బయట వేలాది రూపాయల ఖర్చు పెట్టి కోచింగ్ పొందే స్థోమత లేని తమకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా నాణ్యమైన శిక్షణ అందించారని ధన్యవాదాలు తెలుపుతున్నారు క్వాలిఫై అయిన అభ్యర్థులు. మంత్రి సహకారంతో శిక్షణ తీసుకున్న వారిలో 223 మంది ఎస్సై, 507 మంది కానిస్టేబుల్ మెయిన్స్కు క్వాలిఫై అయ్యారు.
మంత్రి వేముల ప్రశాంతన్న ఎంతో నాణ్యమైన కోచింగ్ అందించారు. బయట కోచింగ్ సెంటర్లకు దీటుగా చక్కని ఫ్యాకల్టీతో బోధన అందించారు. సొంత ఖర్చులతో విలువైన ప్రిపరేషన్ మెటీరియల్ అందించారు. ఆన్లైన్ కోచింగ్ యాప్ అందించి తామంతా విజయం సాధించాలని తపన పడ్డారు. నోటిఫికేషన్ల వేళ మంత్రి కోచింగ్ సేవలు, కోచింగ్ కేంద్రాల్లో అభ్యర్థులకు, గ్రంథాలయాలకు అందించిన ప్రిపరేషన్ మెటీరియల్ వేలాది మంది అభ్యర్థులకు వరంలా నిలిచాయి. ఆయన కల్పించిన ఈ కోచింగ్ సేవలను వినియోగించుకొని కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయ్యాను. ప్రశాంతన్నకు ధన్యవాదాలు.
-అజయ్, పోచంపల్లి, వేల్పూర్ మండలం
ఒక తండ్రి తన పిల్లలకు మంచి కోచింగ్ అందించి ఉద్యోగం సాధించాలని ఎలా కోరుకుంటాడో ఆలా తన నియోజక వర్గం లోని పేద అభ్యర్థుల గురించి ఆలోచించి మంత్రి ప్రశాంత్రెడ్డి ఉచిత శిక్షణ, మెటీరియల్, భోజనం అందించారు. ఆ ప్రోత్సాహంతో ఎస్సై మెయిన్స్కు క్వాలిఫై అయ్యాను. కష్టపడి ఉద్యోగం సాధించి మంత్రికి కానుకగా ఇచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతాం. మంత్రికి రుణ పడి ఉంటాం.
-రేగుల రఘునందన్, వేల్పూర్
మంత్రి ప్రశాంతన్నయ్య ఉచితంగా అందించిన కోచింగ్తో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కు క్వాలిఫై అయ్యాను. ప్రశాంతన్న అందించింది ఉచిత కోచింగ్ మాత్రమే కాదు. సొంత చెల్లెండ్లకు, తమ్ముళ్లకు ఉద్యోగ కోచింగ్ కోసం ఒక అన్నయ్య ఎలాగైతే అన్నీ సమకూర్చి..వెన్ను తట్టి ప్రోత్సహిస్తారో అలాంటి భరోసాను మాకు అందించారు. ప్రశాంతన్న మేలు ఎప్పటికీ మరువ లేం.
-రుచిత, వన్నెల్(బీ), బాల్కొండ మండలం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ వేల్పూర్ మండలం పడగల్లో అందించిన కోచింగ్ సహకారంతో కానిస్టేబుల్ ఉద్యోగం మెయిన్స్కు క్వాలిఫై అయ్యాను. నా లాగా వందలాది మందికి మంత్రి అందించిన ఈ సేవలు ఎంతో దోహదపడ్డాయి. మా అందరికీ మంచి భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో మంత్రి తపన పడడం కోచింగ్ సందర్భంగా ఆయనలో చూశాం.
-పుట్ట రోహిత్, వన్నెల్ (బీ), బాల్కొండ మండలం
కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వేలాది రూపాయల ఫీజులతో ఖరీదైన కోచింగ్ అందుకోలేని పేద అభ్యర్థుల ఆవేదనను గుర్తించి వెంటనే మంత్రి వేముల ఉచితంగా తన సొంత ఖర్చులతో భోజన వసతితో పాటు నాణ్యమైన శిక్షణ అందిస్తానని అభయమిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజక వర్గంలోని పేద అభ్యర్థుల కోసం వేల్పూర్ మండలం పడగల్లో 450 మందికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం మధ్యాహ్న భోజనం అందించారు.
నిష్ణాతులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించారు. పడగల్, నిజామాబాద్ కోచింగ్ సెంటర్లలోని 1500 మందికి ప్రిపరేషన్ మెటీరియల్ అందించారు. ఒక్కో సెట్ వేల రూపాయల విలువ చేస్తుంది. ఇలాంటి సెట్లను ఒక్కో అభ్యర్థికి మూడు సెట్ల చొప్పున అందించారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలోనూ మెటీరియల్ అందించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రంథాలయాలకు మెటీరియల్ అందించారు. వేలాది మంది ప్రిపరేషన్కు లైబ్రరీల్లో ఇవి ఉపయోగపడ్డాయి.
ఉద్యోగం సాధించి భవిష్యత్తును బాగు చేసుకోవాలని.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఎదురు చూస్తున్న యువతకు ఉద్యోగాల భర్తీతో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్న వారిలో కోచింగ్ సెంటర్లలకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేని వారు ఎందరో ఉన్నారు. వారికి అండగా నిలవాలని, తగు ప్రోత్సాహాన్ని అందించి వారిలో విశ్వాసం, భరోసా పెంచాలన్న లక్ష్యంతో ఉచితంగా నాణ్యమైన కోచింగ్తో పాటు మెటీరియల్ అందించి భోజన సౌకర్యం కల్పించాను. ఈ కోచింగ్తో అభ్యర్థులకు ఇప్పుడే కాకుండా ఎప్పటికీ పోటీ పరీక్షలకు ఉపయోగం కలుగుతుంది. తాజాగా ఇందులోంచి 730 మంది ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్కు క్వాలిఫై కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారందరికీ శుభాకాంక్షలు.