ఖలీల్వాడి, నవంబర్ 3 : ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పీహెచ్సీ పరిధిలో 90శాతానికి పైగా గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణుల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడంలో అలసత్వం కనబర్చిన మెండోరా పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు. పీహెచ్సీ వైద్యాధికారిణి నుంచి సంజాయిషీ కోరాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై చౌట్పల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్లకు మోమోలు జారీ చేయించారు. ప్రభుత్వ దవాఖానల్ల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వెనుకబడిన పోచంపాడ్, కిసాన్నగర్, నందిపేట్, పోచంపల్లి, వినాయక్నగర్, చంద్రశేఖర్ కాలనీ, కమ్మర్పల్లి తదితర పీహెచ్సీల వైద్యాధికారులకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
గురువారం ఆయన న్యూ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గర్భిణుల రిజిస్ట్రేషన్ జిల్లాలో సగటున 91 శాతం జరిగినప్పటికీ మెండోరా, చౌట్పల్లి, వేల్పూర్ పీహెచ్సీల పరిధిలో 40 శాతానికి లోబడి మాత్రమే వివరాలు నమోదు చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. మెండోరా హెల్త్ సూపర్వైజర్ను సస్పెండ్ చేస్తూ వైద్యాధికారిని సంజాయిషీ కోరారు.
చౌట్పల్లి పీహెచ్సీ వైద్యాధికారి, సూపర్వైజర్లకు మెమోలు జారీ చేయాలని డీఎంహెచ్వో సుదర్శనాన్ని ఆదేశించారు. వందశాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గత అక్టోబర్లో జిల్లాలో సగటున 54 శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయని, ఇంకా పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరముందన్నారు. ప్రసవాల రేటును పెంపొందించడంలో వెనుకబడిన పీహెచ్సీల వైద్యాధికారులను కారణాలు ఆరా తీస్తూ నిలదీశారు. ప్రస్తుతం మెమోలు జారీ చేస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి పనితీరులో మార్పు కనిపించకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో చేరిన వారిని ఎవరైనా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లపై మళ్లించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ మెరుగైన వైద్యసేవలందించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యసేవల్లో పోటీ పడాలని సూచించారు. నొప్పి లేకుండా కాన్పు చేసేలా జీజీహెచ్లో పరికరాలు అందుబాటులోకి వచ్చినందున ఈ విషయాన్ని గర్భిణులకు తెలియజేయాలన్నారు.
నిజామాబాద్ జీజీహెచ్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులను కాన్పు కోసం తీసుకెళ్లిన సమయంలో తమ పట్ల కొందరు సిబ్బంది అనుచితంగా వ్యవహరించాలని బాధిత ఆశ కార్యకర్తలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని, దవాఖాన సూపరింటెండెంట్లను ఉపేక్షించబోమని, బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. వీసీలో డీఎంహెచ్వో సుదర్శనం, పీవో అంజన, డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు.