నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 27 : ఓ బాలిక కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడు జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. మొత్తం ఐదేండ్లలో 14 ఆటోలను వివిధ జిల్లాల్లో చోరీ చేశారు. ఇందులో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన సయ్యద్ రఫీక్ (32) ఆటోడ్రైవర్గా పనిచేసేవాడు. 2012లో కడెం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక కిడ్నాప్ కేసులో నేరస్తుడిగా ఉన్న రఫీక్కు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. సత్ప్రవర్తన కారణంగా ఆరేండ్లకు రఫీక్ జైలు నుంచి విడుదల య్యాడు. ఆ తర్వాత మంచిర్యాల్ జిల్లా జన్నారం మండలానికి చెందిన షేక్ సాబేర్ (37), నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన ఎండీ సమద్ (35)తో కలిసి ఆటోలను చోరీ చేసేందుకు అలవాటు పడ్డాడు.
జైలులో రఫీక్కు కేటాయించిన ఖైదీ నంబర్ 7586 ను తన లక్కీ నంబర్గా ఓ ఆటో రిక్షాకు నం బర్ ప్లేట్గా పెట్టుకొని ముగ్గురూ కలిసి అందులో తిరుగుతూ ఆటోలే టార్గెట్గా చోరీలకు పాల్పడేవారు. సుమారు ఐదు సంవత్సరాలుగా మొత్తం 13 ఆటోలను చోరీ చేశారు. నిజామాబాద్లో -4, వరంగల్లో-2, జగిత్యాల్లో -2, కరీంనగర్లో -2, హన్మకొండలో – 3 ఆటోలను చోరీ చేశారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మానిక్భండార్ చౌరస్తా వద్ద పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన సయ్యద్ రఫీక్, షేక్ సాబేర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాము ఆటోలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు సీపీ వెల్లడించారు. వారి నుంచి రూ.21 లక్షల విలువ చేసే 13 ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన మరో నిందితుడు ఎండీ సమద్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. కేసును ఛేదించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులను అందజేశారు.