ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్కు వరద తగ్గలేదు. నాలుగు నెలల క్రితం మొదలైన ప్రవాహం ఇప్పటికీ ఆగలేదు. వరద వస్తుండడంతో జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. మిగులు జలాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి పాలనలో జీవం కోల్పోయిన నిజాంసాగర్.. టీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్వవైభవం సంతరించుకున్నది. గలగల పారుతున్న పాల నురగల్లాంటి నీటిని చూసి ఆయకట్టు రైతుల మది ఉప్పొంగుతున్నది.
నిజాంసాగర్, అక్టోబర్ 27: వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం సంతరించుకున్నది. నాలుగు నెలలుగా మంజీర పరవళ్లతో నిండుకుండలా మారింది. దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో దాదాపు 90 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలు జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించడంతో మంజీరా పరీవాహక ప్రాంతం బోసిపోయింది. దీంతో నిజాంసాగర్లో నీటి జాడలు లేక కళాహీనంగా మారి ఆయకట్టుకు సాగు నీరు అందకుండా ఉత్సవ విగ్రహంలా మారింది. తెలంగాణ సాధించుకున్న తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎండిపోకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన లక్ష్యం రైతును రాజు చేస్తానని ప్రకటించి గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్లోకి మళ్లించడంతో నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది.
1931 సంవత్సరంలో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో మంజీరా నదిపై 29.72 టీఎంసీల సామర్థ్యంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా నిర్మించారు. 1972 సంవత్సరం కాలంలో ప్రాజెక్టులో ముందుగా ఊహించినదాని కన్నా రెండింతలు పూడిక పేరుకుపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా 11.79 టీఎంసీలకు పడిపోయింది. 1978లో ప్రాజెక్టు వరద గేట్లను ఐదు అడుగులకు పెంచి 17.80 టీఎంసీలకు చేర్చారు. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడం, నిజాంసాగర్ ఎగువ భాగంలో సింగూరు ప్రాజెక్టు నిర్మించడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించి నిజాంసాగర్ ఆయకట్టు కొంత మేరకు స్థిరీకరించడంతో నిజాంసాగర్ ఆయకట్టు 2.31 లక్షల ఎకరాలకు పరిమితమైంది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు హల్దీవాగు ఆయువు పట్టుగా నిలిచింది. గోదావరి నీరు హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరి పోసేలా నిలవడం నిజంగా అద్భుతమే. గోదావరినీరు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేట ఖాన్ చెరువు నుంచి ఆరంభమయ్యే హల్దీవాగు యావాపూర్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మెదక్ జిల్లాలో 47 కిలో మీటర్లు ప్రవహించి మెదక్ మండలంలో ర్యాలమడుగు-ఎల్లాపూర్ల వద్ద మంజీరా నదిలో కలుస్తుంది. మంజీరా వాగు పరుగులు తీస్తూ గోదావరి జలాలు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల మీదుగా నిజాంసాగర్కు చేరేలా పనులు పూర్తిచేయడం సాగర్కు పూర్వవైభవం వచ్చింది.
ఎన్నడూ లేని విధంగా గడిచిన 30 సంవత్సరాల నుంచి జూలై నెలలో నిజాంసాగర్ నీటిని మంజీరాలోకి విడుదల చేయడం ఇదే ప్రథమం. నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు 52 రోజుల పాటు 72.91 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి విడుదల చేశారు. 23 సంవత్సరాల క్రితం 132 టీఎంసీల నీటిని మంజీరాలోకి విడుదల చేసిన అనంతరం మళ్లీ 72.91 టీఎంసీల నీటిని మంజీరాలోకి విడుదల చేయడం ఇప్పుడే.
నాడు ప్రాజెక్టులో ఎప్పుడు చూసి నా జలకళ సంతరించుకొని ఉండేది. దీంతో ప్రతిఏటారెండు పంటలను సాగు చేసుకునేవాళ్లం. అలాంటిది రోజులు గడిచే కొద్దీ నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో లేకపోవడంతో బీడు భూములుగా ఉంచుకున్నాం. సీఎం కేసీఆర్ చొరవతో నిజాంసాగర్లోకి గోదావరి నీరు రావడంతో మాకు సాగు నీటి ఢోకా లేకుండా రెండు పంటలకు పుష్కలంగా నీరు వచ్చే రోజులు వచ్చాయి. మళ్లీ అప్పటి రోజులు వచ్చినందుకు సంతోషంగా ఉంది.
-దుర్గారెడ్డి, రైతు, గోర్గల్, నిజాంసాగర్
నాలుగు నెలలుగా నిజాంసాగర్ నీటిని మంజీరాలోకి నిరంతరాయంగా విడుదల చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నీటి విడుదలే మంజీరాలో జలసవ్వడే దర్శనమిస్తోంది. ఇక రానున్న యాసంగి, వాన కాలం పంటలకు ఢోకా లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది గోదావరి నీటిని నిజాంసాగర్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి నీటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగు చేసుకున్నాం.
-గంగారెడ్డి, రైతు, కొమలంచ, నిజాంసాగర్
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎప్పుడూ లేని విధంగా జూలై నుంచి నీటిని విడుదల చేయడం 30 ఏండ్లలో ఇదే ప్రథమం. 52 రోజుల పాటు 72.91 టీఎంసీల నీటిని మంజీరాలోకి విడుదల చేయ డం కూడా ఎన్నో సంవత్సరాలవుతుంది. యాసంగి, వానకాలం పంటలసాగుకు ఢోకా లేకుండా పోయింది.
-శివకుమార్, నీటి పారుదల శాఖ ఏఈ