ఖలీల్వాడి, అక్టోబర్ 16 : సహకార శాఖకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉందని, రైతులకు మెరుగైన సేవలందించాలని జిల్లా సహకార శాఖ అధికారి సింహచలం అన్నారు. మోపాల్ మండలంలోని బోర్గాం గ్రామంలో ఉన్న మోటాటిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ సీఈవోల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. సొసైటీ సీఈవోలకు హెచ్ఆర్సీ పాలసీ అమలు జేయాలని కోరారు.
సహకార చట్టాలకు లోబడి పనులు చేయాలన్నారు. రైతల పక్షాన ఉండి పనిచేస్తున్నప్పుడే సహకార సంఘలు లాభాల బాటలో నడుస్తాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సహకార సంఘాల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు వచ్చే ప్రయోజనలతోపాటు సహకార ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సహకార ఆడిటర్ పాపయ్య, రవీందర్, రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శలు రమేశ్ బాబు, శంకర్గౌడ్, జిల్లా అధ్యక్షుడు దయాసాగర్, ప్రధాన కార్యదర్శి దొంతుల నర్సయ్య, విష్ణువర్ధన్, మోహిద్ బాష, నాగరాజు, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.