ఖలీల్వాడి, సెప్టెంబర్ 30:బీడీలు చుడుతూ అరకొర ఉపాధితో బతుకు వెళ్లదీస్తున్న బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న ఆసరా పింఛన్లు కొండంత భరోసానిస్తున్నాయి. బీడీ కార్మికుల కష్టసుఖాలు తెలిసిన నేతగా వారికి సీఎం కేసీఆర్ జీవనభృతి అందిస్తూ అండగా నిలుస్తున్నారు. దేశంలోనే బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీడీ కార్మికుల కుటుంబాలను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదని.. కేసీఆర్ సారు దేవుడోలే ఆదుకుంటున్నారని బీడీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది బీడీ పరిశ్రమ. బీడీ పరిశ్రమ రోజురోజుకూ నిరాదరణకు గురవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆసరా పింఛన్ ద్వారా మొదట వెయ్యి రూపాయలు అందించింది. 2019 ఎన్నికల అనంతరం ఆసరా పింఛన్ను రూ.2016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై ఆధారపడి 10లక్షలకు పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 1960 ప్రాంతంలో వెళ్లూనుకున్న బీడీ పరిశ్రమ అనతికాలంలోనే లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ తెలంగాణలో అతిముఖ్యమైన రంగంగా నిలిచిపోయింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీడీ పరిశ్రమకు పుట్టినిల్లుగా పేర్కొనవచ్చు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 2లక్షలకు పైగా బీడీ కార్మికులుండగా వీరిలో పీఎఫ్ ఉన్న కార్మికులను గుర్తించి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ జీవనభృతి అందిస్తూ భరోసాగా ఉంటున్నారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు పని చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వారి బాగోగులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ హయాంలో బీడీలు వద్దని పుర్రె గుర్తు తెచ్చింది. బీడీ పరిశ్రమపై బీజేపీ 28శాతం జీఎస్టీ విధించి పరిశ్రమను దెబ్బతీసింది. దేశంలోనే బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా ఇలాంటి పథకం అమలు కావడం లేదు. మాట తప్పని నాయకుడిగా సీఎం కేసీఆర్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఇలాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లోని బీడీ కార్మికులకు సైతం పింఛన్ లబ్ధి చేకూరే అవకాశమున్నదని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రధానిగా కేసీఆర్ అయితే మాలాంటి కార్మికులు, కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ సారు వెంటే మేముంటామని పిడికిలెత్తి చెబుతోందీ బీడీ కార్మికలోకం.
ప్రజలకు మంచిచేసే నాయకుడు..
సీఎం కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం ఉన్న నాయకుడు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని పింఛన్ తెలంగాణలోనే అమలవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీడీ కార్మికుల ఓట్లు తప్ప మమ్మల్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ఒక్కడే మమ్మల్ని గుర్తించారు. ఇలాంటి సీఎం దేశమంతటా వెతికినా దొరకడు. అందుకే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టాల్సిందే..
– నాగలత, బీడీ కార్మికురాలు,నిజామాబాద్
మహారాష్ట్రలో లేదు..
బీడీ కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ సార్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూసినవారే కావడంతో ఆసరా పింఛన్లలో అవకాశం కల్పించారు. దీంతో మా కుటుంబాలకు ఆర్థికంగా చాలా భరోసా కలుగుతున్నది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీడీలు చేస్తున్న మా బంధువులకు ఇలాంటి పింఛన్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. కేసీఆర్ సార్ ప్రధాని అయితే అంతటా పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది.
– పద్మ, బీడీ కార్మికురాలు,నిజామాబాద్
చెప్పింది.. చేస్తడు..
సీఎం కేసీఆర్ సార్ ఏదైనా చెప్పిండంటే.. చేస్తడు. ఇసొంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు. అడగకముందే బీడీలు చేసేటోళ్ల బాధలు తెల్సుకొని పింఛన్ ఇస్తుండు. పదవిలకు అచ్చిన ఎంటనే పింఛన్ ఇస్త అన్నడు. మొదట్ల వెయ్యి రూపాల పింఛన్ ఇచ్చిండు. తర్వాత ఎలక్షన్ల పింఛని పెంచుతనన్నడు.. గెలిచినంక చెప్పినట్లే రెండువేల పదహారు చేసిండు. ఇసొంటి ముఖ్యమంత్రి దేశంలనే పెద్ద పదవిలోకి పోతే అందరి గురించి ఆలోచిస్తడు. కేసీఆర్ సార్ ఎట్ల అంటే అట్లనే. ఆ సార్తోనే మేమంతా..
– రమాదేవి,బీడీ కార్మికురాలు, నిజామాబాద్
ప్రజల కోసం దేశ రాజకీయాల్లోకి రావాలి..
ప్రజల బాగు కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశమంతటా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తూ దేశ చరిత్రలోనే నిలిచారు. ఇలాంటి నాయకుడు దేశాన్ని పరిపాలిస్తే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. మా బీడీ కార్మికులమంతా కేసీఆర్ వెంటనే నడుస్తాం.
– కావ్య, బీడీ కార్మికురాలు, నిజామాబాద్