రాష్ట్ర పథకాలు జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ శుద్ధ జలాల సరఫరా మొదలుకొని రైతుబంధు, రైతుబీమా వంటి సంచలన పథకాలు జాతి దృష్టిని ఆకర్షించాయి. అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ అందరికీ సంక్షేమ ఫలాలు ఒక్క తెలంగాణలోనే అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో జాతీయ అవార్డులు రాష్ర్టాన్ని వరించాయి. తాజాగా కేంద్రం మరో పురస్కారాన్ని ప్రకటించింది. మిషన్ భగీరథ పథకాన్ని కీర్తిస్తూ జల్ జీవన్ మిషన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ‘భగీరథ’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో 1,681 ఆవాసాలకు శుద్ధజలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన నీటితో ప్రజల గొంతు తడుపుతుండడంతో జల్ జీవన్ మిషన్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు మోదీ సర్కారు తాజాగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభిస్తుండడం సీఎం కేసీఆర్ దార్శనికతకు, పాలనా దక్షతకు గీటురాళ్లుగా నిలుస్తున్నాయి.
నిజామాబాద్, సెప్టెంబర్ 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సంపాదిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో, స్వయం పాలిత రాష్ర్టాల్లో చేయలేని అనేక పనులను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాల నుంచి ఇంటింటికీ స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందించే వరకు విప్లవాత్మకమైన పథకాలను తీసుకు వచ్చారు. 2014లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తానని చెప్పిన మాటలను నిజం చేసి నేడు అద్భుతాన్ని ఆవిష్కరించారు. దాదాపు మూడున్నరేండ్లుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రతి గడపకూ మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయి. మొత్తం 1681 ఆవాసాలకు సుమారు రూ.700కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను కల్పించి నీళ్లను అందిస్తున్నారు. భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లో ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఇంటి ముంగిటకే స్వచ్ఛమైన జలాలు వస్తుండడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
జాతీయ స్థాయిలో ఇందూరు ఖ్యాతి…
రాష్ర్టానికి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా ఏదో ఒక విభాగంలో ఉభయ జిల్లాలు పనితీరులో కేంద్ర సర్కారు మెప్పును పొందుతున్నాయి. గతేడాది దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీలుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు గ్రామాలు ఎంపికయ్యాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షణ్లోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ అనేక విభాగాల్లో గుర్తింపును సొంతం చేసుకుంది. మొన్నటికి మొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో దేశ వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాకు 3వ స్థానం, సదరన్ రీజియన్లో 2వ స్థానం కూడా వశమైంది. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పురస్కారాన్ని ప్రకటించింది. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ర్టానికి గుర్తింపు వరించిన వేళ ఉభయ జిల్లా ప్రస్థానం మరువలేనిది. గతంలో ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మిషన్ భగీరథ పథకం అమలుకు సారథిగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పని చేశారు. ఆయన హయాంలో ఉమ్మడి జిల్లాలో మెరుగైన పనులతో మిషన్ భగీరథ పథకం వేగంగా అమలై ప్రభుత్వాల గుర్తింపును సొంతం చేసుకుంది. అత్యధిక గిరిజన గూడేలకు తాగునీరు అందిస్తున్న జిల్లాల్లోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముందుండడం విశేషం.
ఇటు సింగూర్… అటు ఎస్సారెస్పీ…
ఉభయ జిల్లాలకు మిషన్ భగీరథ నీటికి సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే కీలకం. సింగూర్ ప్రాజెక్టు నీటి ద్వారా బోధన్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో 6 మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు ఎల్లారెడ్డిలోని 3 మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. సింగూర్ సెగ్మెంట్ పరిధిలో 21 మండలాలకు 819 ఆవాసాలకు నీళ్లు అందేలా ఏర్పాట్లు చేశారు. 518.44 కిలో మీటర్లు పైప్ లైన్ పనులు పూర్తి చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీటి పథకం వర్తిస్తోంది. శ్రీరాంసాగర్ సెగ్మెంట్లో 1547 కిలో మీటర్లు మేర పైప్లైన్ బిగింపు పూర్తయ్యింది. 862 ఆవాసాలకు బల్క్వాటర్ సప్లయ్ విజయవంతంగా ప్రతి రోజూ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 1681 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం అందుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2019, జూన్లో బల్క్ వాటర్ విడుదలలో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఆ తర్వాత మూడేండ్లుగా కాలంతో సంబంధం లేకుండా మంచి నీళ్లు నేరుగా ప్రజల చెంతకే చేరుతున్నాయి.
సుదూర ప్రాంతాలకు స్వచ్ఛ జలాలు…
కేంద్ర సర్కారు గుర్తింపు సాధించడంలో మిషన్ భగీరథ పథకం ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఇందులో రిమోట్ ఏరియాలోని నివాసాలకు సైతం పైప్లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ జలాలు అందించడంపై దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిస్థితి ఉభయ జిల్లాల్లోనూ కనిపిస్తున్నాయి. సాధారణంగా గిరిజనుల ఆవాసాలన్నీ పల్లెకు, పట్టణాలకు సుదూరంగా ఉంటాయి. జనావాసాలకు విసిరేసినట్లుగా అడవుల్లో వారంతా జీవనం సాగిస్తుంటారు. అడవుల్లో దొరికే సంపదను వాడుకుంటూ బతుకీడుస్తున్న గిరిజన తండాలకు భగీరథ నీటిని తీసుకుపోవడం అసాధారణ ప్రక్రియ. ఎత్తు పల్లాలను దాటుకుని, వాగులు, వంకలను లెక్క చేయకుండా పైప్లైన్లను శ్రమకోర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తండాలకు చేరుతున్న భగీరథ జలాల రాకను పరిశీలిస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని పైప్లైన్ల అమరిక సాగింది. భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించి పైప్లను భూ అంతర్భాగం గుండా వేశారు. దట్టమైన అడవులు, కాలువలు, కెనాల్ మీదుగా భారీ ఎత్తున ఇనుప వారధులను నిర్మించి వాటి గుండా పైపులను అమర్చారు. అవసరమైన చోట మాత్రమే మోటార్లు బిగించడం, మిగిలిన ప్రాంతాల్లో గ్రావిటీ ఆధారంగానే నీళ్ల పంపిణీ జరుగున్నది.
మినరల్ వాటర్ కొనుక్కునే స్థోమతలేదు
రోజూ వారీకూలీతో జీవనం సాగిస్తున్న మాకు ఫిల్టర్ వాటర్ను కొనుక్కుని తాగే స్థోమత లేదు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మిషన్ భగీరథ నీరు మా దాహార్తిని తీర్చింది. మా ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్కు కృతజ్ఞతలు.
-మన్నేమాల రమేశ్, ముప్కాల్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రస్తుతం నీరు కలుషితంగా మారింది. తాగడానికి మంచినీరు దొరకడంలేదు మొత్తం ఫ్లోరైడ్ తో నిండిన నీరు తాగడంతో ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు.రోజుకు రూ.10 లతో నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తున్నందుకు రుణపడి ఉంటాం.
– రమావత్ సురేశ్, ముప్కాల్