ఆర్మూర్, సెప్టెంబర్ 28 : నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను మరింత చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇప్పటికే తండాలు, పల్లెల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు పీహెచ్సీల్లో వైద్యసిబ్బందిని ఏర్పాటు చేసి మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యసేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగానే బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నది. నిజామాబాద్ అర్బన్లో 3, ఆర్మూర్ మున్సిపాలిటీలో 3, బోధన్ మున్సిపాలిటీలో ఒకటి మొత్తం 7 దవాఖానలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే నిజామాబాద్, బోధన్లో ఒక్కో దవాఖానను ప్రారంభించారు.
కాలనీల్లోనూ వైద్య సేవలు అందనుండడంతో పట్టణాల్లోని నిరుపేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఎంపిక చేసి అవసరమైన చోట నిర్మాణాలు పూర్తి చేసి త్వరలోనే మిగతా చోట్ల బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. భవనాల నిర్మాణంతో పాటు వైద్యులు, నర్సులు, సూపర్వైజర్లు, ల్యాబ్టెక్నీషియన్లు, ఏఎన్ఎంల నియమకాలను సైతం ప్రభుత్వం ఇదివరకే చేపట్టింది.
బస్తీ దవాఖానలతో ఇంటి ముందుకు వైద్యం
రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలను ప్రజలకు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తుండడంతో నిరుపేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్తీ దవాఖానలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయి. నిరుపేదలకు ప్రాథమిక వైద్య సేవలందించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అత్యవసరమైతే దగ్గరలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, జిల్లా దవాఖాన, హైదరాబాద్ వైద్యశాలలకు వైద్యులు రిఫర్ చేస్తారు. దవాఖాన సమీపంలోనే ఉండడంతో ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణమే వైద్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు, వైద్య సేవలు అందడంతో పేదలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రైవేటు దవాఖానల్లో వేలాది రూపాయల ఖర్చులు చేసే బాధ తప్పుతుంది.
పేద ప్రజలకు ఎంతో మేలు
పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు బస్తీ దవాఖానల ఏర్పాటుతో ఎంతో మేలు జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపించారు. దవాఖానలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
-డాక్టర్ తుడుము రాహుల్,బస్తీ దవాఖాన వైద్యుడు, ఆర్మూర్
బస్తీ దవాఖానల ఏర్పాటు హర్షణీయం
పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం హర్షణీయం. నిరుపేదలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా దగ్గరలోనే వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
-పండిత్ వినిత, మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూర్