బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 26 : దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బడుగు, బలహీనవర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామ పెద్ద చెరువులో 84వేల చేప పిల్లలను స్థానిక ప్రజా ప్రతినిధులు, గంగపుత్రులతో కలిసి విడుదల చేశారు. అంతకుముందు మత్స్యశాఖ అధికారులు సరఫరా చేసిన చేప పిల్లలను గంగపుత్రుల సమక్షంలో తూకం వేసి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం చేప విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారులను హెచ్చరించారు. గంగపుత్రులు నష్టపోకుండా చెరువు విస్తీర్ణాన్ని బట్టి అవసరమగు చేప పిల్లలను అందించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభాపతి మాట్లాడారు. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గంగపుత్రులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల చెరువులు, 72 ప్రాజెక్టుల్లో 83 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై అందిస్తున్నదని వివరించారు. రూ. 100 కోట్లతో ఉచితంగా చేప పిల్లలను అందిస్తే, మత్స్యకారులకు ఏడాదికి రూ. 10వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. చెరువుల్లో చేప పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలని ఆయన సూచించారు.
గతంలో చేపలన్నీ దళారులపాలు
గతంలో పాలకుల నిర్లక్ష్యంతో గంగపుత్రులు ఆర్థికంగా అభివృద్ధి సాధించలేకపోయారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన చేపలన్నీ దళారులపాలయ్యేవని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులకు విక్రయించవద్దన్నారు. చెరువుల్లో పెంచిన చేపలను మత్స్యకారులే విక్రయించి లాభాలను పొందాలన్నారు. ఇది సంక్షేమ ప్రభుత్వమన్నారు. పని చేస్తు న్న ప్రభుత్వాలను ఆదరించాలన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కొన్ని పార్టీల నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించే అవకాశం ఉందన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇబ్రహీంపేట్ చెరువు అలుగును విస్తరించాలని గ్రామానికి చెందిన గంగపుత్రులు స్పీకర్ను కోరగా.. తక్షణమే సర్వే నిర్వహించి నివేదిక అం దించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఉప సర్పం చ్ సాయిలు, మత్స్యశాఖాధికారి వెంకటేశ్వర్లు, గంగపుత్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, సాయిలు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ఇబ్రహీంపేట్ తండా సర్పంచ్ ప్రేమ్సింగ్ పాల్గొన్నారు.