సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగాన్ని తలపించేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. అన్ని కులాలకు సమ ప్రాధాన్యమిస్తూ.. వెనుకబడిన కులాలకు అండగా నిలుస్తుండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు రోల్మోడల్గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అలుముకున్న చీకటిని పారదోలేందుకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయా కుల సంఘాల నేతలు కోరుతున్నారు.
-నిజాంసాగర్, సెప్టెంబర్ 24
స్వర్ణయుగం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది గుప్తుల కాలం నాటి అభివృద్ధి.. సంక్షేమంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పరుగులు పెట్టాయని చరిత్ర చెబుతున్నది. నేడు రాష్ట్రంలో కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తుందన్న మాట సర్వత్రా వినిపిస్తున్నది. అన్ని కులాల వారిని ప్రోత్సహిస్తుండడం, కులాల వారీగా ఆదుకునేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుండడంతో నేడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న పథకాలు ఇతర రాష్ర్టాలకు రోల్మోడల్గా నిలుస్తున్నాయి. ఇదే మోడల్ దేశానికి అవసరమని ముక్తకంఠంతో చెబున్నారు. దేశంలో అలుముకున్న చీకటిని పారదోలేందుకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటేనే ప్రజలు దైర్యంగా సంతోషంగా ఉంటారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది. ఫలితంగా తెలంగాణలోని పథకాలు అభివృద్ధి పనులు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని కేసీఆర్ సారు అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిపారు. దేశాన్ని కూడా ఆగ్రగామిగా నిలిపే సత్తా ఆయనకు మాత్రమే ఉంది.
-నర్సింహులు, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, నర్వ
దేశ ప్రగతి కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి తప్పకుండా రావాలి. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా ఆయనకు మాత్రమే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు, పట్టణాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. దేశాన్ని అభివృద్ధ్ధి పథంలో నడిపించడం సీఎం కేసీఆర్ ఒక్కడితోనే అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశ రాజకీయాల్లో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. పోరాట యోధుడు కేసీఆర్తోనే దేశంలో పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేరుతాయి.
-బాబూసింగ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు
రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాష, యాసకు గౌరవం వచ్చిందంటే అది కేసీఆర్ సార్ చొరవే. అంతే కాకుండా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కుతుందంటే ఆయనే కారణం. సీఎం కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన గొప్ప నాయకుడు. తెలంగాణలోని ప్రజలందరీ అవసరాలు తీర్చడంలో ఆయనకు సాటి ఎవరూ రారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సుపరిపాలనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. ఈ తరుణంలో ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం చాలా మంచి ఆలోచన. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం కూడా అన్ని రంగాల్లో ఆగ్రగామిగా నిలుస్తుంది.
-విజయ్దేశాయ్, లింగాయత్ సంఘం అధ్యక్షుడు,పెద్దకొడప్గల్ మండలం
దేశం బాగుపడాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. పార్టీలకతీతంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా ఎక్కడా లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడంతోనే నేడు అన్ని వర్గాల ప్రజల మద్దతు కేసీఆర్ సార్కే ఉంది. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు, నాయకులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు జాతీయ స్థాయిలో రాణిస్తే అన్ని రాష్ర్టాల్లో ఈ పథకాలు అమలవుతాయనే ఆశ దేశ ప్రజల్లో ఉంది. అందుకే అందరూ కేసీఆర్ సార్కే మద్దతు తెలుపుతున్నారు.
– జఫార్, పెద్దకొడప్గల్ మండల కో-ఆప్షన్ సభ్యుడు, మైనార్టీ నాయకుడు
ఆంధ్రపాలకుల దోపిడీ నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని విముక్తి చేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ప్రధాని అవ్వడం ఖాయం. నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో దేశ రాజకీయాల్లోకి వెళదామా అని సభలో ప్రజలను అడుగగా ప్రజలందరూ వెళ్లాలంటూ నినాదాలు చేశారు. జిల్లా నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్దామని ప్రకటించడం శుభపరిణామం. కేసీఆర్ ప్రధాని అయితే దేశంలోని రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్ అందించవచ్చని కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఎక్కడాలేని విధంగా వంద శాతం సబ్సిడీ కింద చేపపిల్లలను పంపిణీ చేసి గంగపుత్రుల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు.
– కొరట్పల్లి ఆనంద్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ వంటి విజన్ కలిగిన నాయకుడు మన దేశానికి ఎంతో అవసరం. ఆయన రాష్ర్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో దేశానికి కూడా మార్గనిర్దేశం చేసే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు మన వద్ద అమలవుతున్నాయి. మాలాంటి వారికి దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలను అందించడంతో నేడు రాష్ట్రంలో లక్షాధికారిగా ముఖ్యమంత్రికేసీఆర్ దయ వల్ల తలెత్తుకొని తిరుగుతున్నాం. అందుకే జాతీయ స్థాయిలో రాణిస్తే మన దేశం సైతం తలెత్తుకునేలా చేసే సత్తా గల నాయకుడు ఆయన.
-రమేశ్, నిజాంసాగర్ మండల అంబేద్కర్ యువజన సంఘం, ప్రధాన కార్యదర్శి
డిచ్పల్లి : తెలంగాణ సాధించి దేశంలోనే రాష్ర్టాన్ని సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిపిన ఘనత కేసీఆర్ సార్దే. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఇదే మోడల్ను దేశమంతా ప్రవేశ పెట్టాలి. ఆయన పెట్టబోయే జాతీయ పార్టీకి కుల సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. కేసీఆర్ ప్రధాని అయితే దళితులపై దాడుల నిర్మూలనతో పాటు దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.
-ఆసది ప్రమోద్, మాలమహానాడు మండల అధ్యక్షుడు, డిచ్పల్లి
నాయిబ్రాహ్మణ కులస్తులు, వారి కులవృత్తికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు రాష్ర్టానికే కాక దేశానికి సైతం ఎంతో అవసరం. అడగకుండానే ఉచిత కరెంటు ఉచితంగా ఇస్తూ వారికి వెన్నుదన్నుగా నిలిచారు. గత పాలకులు కులవృత్తులను మరుగున పడేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే కులవృత్తులన్నింటికీ పూర్వవైభవాన్ని తెచ్చేందుకు గాను కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడ్డారు. అలాంటి గొప్ప నేత ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని అయితే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ నాయిబ్రాహ్మణుల సంపూర్ణ సహకారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇస్తాం.
-మీన్కూర్ నర్సయ్య, తెలంగాణ నాయిబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు, ఇందల్వాయి
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు గిరిజనుల సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఉన్న బంజారాలు సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతును ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో వారి అభ్యున్నతికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నేత ఎంతో అవసరం.
-జరుకుల సతీశ్, మండల బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలుపుతూ.. అడగకుండానే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారి ముంగిట్లోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అలాంటి గొప్ప నేత ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం. కేసీఆర్ వైపు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశాన్ని అధోగతి పట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు దూరం చేయాలని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం.
-కందగిరి శ్రీనివాస్, విశ్వకర్మ సంఘం మండల ప్రధాన కార్యదర్శి