బీర్కూర్, సెప్టెంబర్ 23: అటవీ భూములను సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరం పదికాలాలపాటు చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందేనని పేర్కొన్నారు. అటవీ, పోడు భూముల సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కల్యాణమండపంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులతో అటవీ, పోడు భూముల సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ, రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు పాస్ పుస్తకాలను అందించిన మొదటి మండలం బీర్కూర్ అని, నియోజకవర్గం బాన్సువాడ అని తెలిపారు. గ్రామాల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
భవిష్యత్తులో అటవీ, ప్రభుత్వ శాఖల మధ్య గొడవలు లేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 2005లో నూతన అటవీ చట్టాన్ని రూపొందించగా, 2007 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 2005 కన్నా ముందు నుంచి కబ్జాలో ఉండి అటవీ భూ ములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని చట్టంలో పొందుపర్చారని చెప్పారు. చట్టాన్ని గౌరవించిన వారికే పట్టాలను అందిస్తామన్నారు. 2005 తరువాత అడవులను నరికి భూములను సాగు చేసి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి పట్టాలు రావన్నారు. అలాం టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అడవులను నరికి భూమిని సాగు చేసుకోవచ్చంటూ అమాయక రైతులు, గిరిజనులను కొంతమంది మభ్యపెడుతున్నారని చెప్పారు. అడవులను నరకడం, పోడు వ్యవసాయం చేయడం కుదరదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇలాంటి స మస్యల పరిష్కారం కోసం 15 మందితో గ్రామ అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ రాష్ట్రంలోనే మొదటిసారి
బీర్కూర్ మండలంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించి, నూతన పాసు పుస్తకాలను ముగ్గురు రైతులకు అందజేయడం రాష్ట్రంలోనే మొదటిసారి అని సభాపతి తెలిపారు. భూముల సమస్యలను పరిష్కరించే ప్రయత్నాన్ని బాన్సువాడ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. భూ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి డిసెంబర్లోపు పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ భూములైతే ప్రభుత్వ పాసు పుస్తకం, అటవీ భూములైతే ఆర్వోఎఫ్ఆర్ పుస్తకం అందిస్తారని తెలిపారు. హక్కుదారులకు పాస్ పుస్తకాలు అందజేసి రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేస్తారని చెప్పారు. పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి పాస్ పుస్తకాలను ఆధారంగా తీసుకుంటున్నందున రైతులకు పరిష్కారం లభిస్తుందన్నారు. హక్కుదారులకు నయాపైసా ఖర్చు లేకుండా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని, కమిటీలు ప్రశాంతంగా పనిచేయడానికి పోలీసు శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎఫ్వోలు వికాస్, నిఖిత, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవోలు రాజేశ్వర్, రాజాగౌడ్, ఏఎం సీ చైర్మన్లు ద్రోణవల్లి అశోక్, నెర్రె నర్సింహులు, ఎంపీపీలు దొడ్ల నీరజ, తిలకేశ్వరి రఘు, పాల్ద్య విఠల్, జడ్పీటీసీ తనబుద్ది స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.