విద్యానగర్, సెప్టెంబర్ 17: బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న చీరెలు జిల్లాకు చేరాయి. రేషన్ కార్డులో పేరుండి 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికీ, మహిళకూ ఈ చీరెలను పంపిణీ చేయనున్నది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3 లక్షల 17 వేల మంది మహిళలకు చీరెలను పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు లక్షా 20 వేల చీరెలు చేరాయి. ఈసారి బతుకమ్మ చీరెలను రెండు విభిన్నమైన సైజుల్లో తీర్చిదిద్దారు. 9 మీటర్ల చీరెలతోపాటు 6.3 మీటర్ల చీరెను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాకు చేరిన చీరెలను భిక్కనూర్, బిర్కూర్, దోమకొండ, గాంధారి, జుక్కల్, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, పిట్లం, తాడ్వాయి, గాంధారి మండలాల్లో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. త్వరలో జిల్లా కేంద్రంతోపాటు 22 మండలాల్లో చీరెలు పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి భిన్నమైన పథకాలు తీసుకువచ్చిన సర్కారు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకంగా వాటిని అమలు చేస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోంది. 2017 ఆగస్టులో ప్రారంభించిన బతుకమ్మ చీరెల పంపిణీని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో బతుకమ్మ చీరెలు పంపిణీపై కమిటీలకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. 18 ఏళ్లు నిండిన యువతులతోపాటుగా మహిళలందరికీ చీరెలను బతుకమ్మ సారెగా రాష్ట్ర సర్కారు తరపున అందిస్తారు. వీటి ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడంతోపాటు చేనేత కార్మికులకు రోజంతా పని లభించేలా చర్యలు చేపట్టింది. సిరిసిల్లాలోని వందలాది మంది చేనేత కుటుంబాల జీవితాల్లో బతుకమ్మ చీరెల తయారీ వెలుగులు నింపుతోంది.
సర్కారు తీసుకున్న నిర్ణయం మూలంగా దసరా పండుగకు ముందే ఇటు చేనేత కార్మికులు, మరోవైపు తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషం వ్యక్తం చేస్తుండటం విశేషం. ముచ్చటగా మూడోసారి అమలవుతోన్న బతుకమ్మ చీరెలను వినూత్న డిజైన్లలో రూపొందించారు. 10 రంగుల్లో వీటిని తయారు చేయడమే కాకుండా 10 రకాల డిజైన్లను జోడించారు. 100 విభిన్నమైన రీతుల్లో బతుకమ్మ చీరెలు యావత్ తెలంగాణ మహిళాలోకాన్ని ఆకర్షించనున్నాయి.
జిల్లా కేంద్రంతోపాటు 22 మండలాల్లోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ చీరెలు జిల్లా కేంద్రం, భిక్కనూర్, గాంధారి, బిచ్కుంద, మండలాల నుంచి అన్ని గ్రామాల్లోని రేషన్ దుఖాణాలకు చేరాయి. తెల్లరేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికీ, మహిళకూ చీరెను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి స్ధానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో చీరెలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో జిల్లా కేంద్రంతో పాటు 3 లక్షల 17 చీరెలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు లక్షా 20 వేల చీరెలు జిల్లాకు చేరాయి. భిక్కనూర్కు 5 వేలు, బిచ్కుందకు 7 వేలు, బిర్కూర్ 25వేలు, దోమకొండ 4 వేలు, గాంధారి 6 వేలు, జుక్కల్ 4 వేలు, మాచారెడ్డి 25 వేలు, నాగిరెడ్డిపేట్ 9 వేలు, పిట్లం 5 వేలు, తాడ్వాయి 30 వేలు, గాంధారిలో 6 వేల చీరలు భద్రపరిచారు.
జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని 22 మండలాల్లో చీరెల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు లక్షా 20 వేల చీరెలు జిల్లాకు చేరాయి. తెల్లరేషన్ కార్డు కలిగిన 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికీ, మహిళలకూ చీరెలు పంపిణీ చేస్తాం. భిక్కనూర్, బీర్కూర్, దోమకొండ, గాంధారి, జుక్కల్, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, పిట్లం, తాడ్వాయి, గాంధారి మండలాల్లో భద్రపరిచాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం.
– సాయన్న, డీఆర్డీవో