నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 17: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంకుల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో న్యాయసేవా సంస్థ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో ఆమె పలు సూచనలు చేశారు. వ్యక్తులు, కంపెనీలు, చిరువ్యాపారులు వారివారి ఆర్థికాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దేశం ప్రగతి పథంలో పయనించడానికి బ్యాంకులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. రుణగ్రహీతలు అనివార్యకారణాలతో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు, రుణగ్రహీతల మధ్య రాజీ కుదర్చి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లోక్ అదాలత్ల ద్వారా లభిస్తుందని అన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ దావాలు, కుటుంబ వివాదాలు లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు.
లోక్ అదాలత్లకు పెద్ద ఎత్తున్న కక్షిదారులు రావడం వారి పాత బకాయీలను, కేసులను పరిష్కరించుకోవడం న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వసనీయతను మరింత పెంపొందిస్తుందని ఆమె అన్నారు. శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో 22 బ్యాంకు రుణ గ్రహీతల కేసులు రాజీ పద్ధతిన పరిష్కరించి, రూ.6.42 లక్షలకు అవార్డులు జారీ చేసినట్లు సంస్థ కార్యదర్శి పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ నాగేంద్ర కుమార్, సంస్థ ప్యానల్ న్యాయవాది బట్టు మాణిక్ రాజు, కక్షిదారులు పాల్గొన్నారు.