కడెం, ఆగస్టు 30: మావోయిస్టుల మాయలో పడి యువత ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మండలంలోని గండిగోపాల్పూర్, గోండుగూడెం, కట్టకిందగూడెం, మిద్దెచింత, ఉడుంపూర్లో పోలీసు సిబ్బందితో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమకున్న సమాచారం ప్రకారం ఇటీవల ఈ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులుసంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు.
యువతీ యువకులు వారి కార్యకలాపాలకు ఆకర్షితులై తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. పథకాలను వినియోగించుకొని అభివృద్ధి సాధించాలన్నారు. ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు ప్రజల దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో కానీ, లేదా డయల్ 100 కి కానీ సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచడంతో పాటు, వారికి తగిన బహుమతులు కూడా అందిస్తామని తెలిపారు. అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న నిర్మల్ జిల్లాలో మావోయిస్టుల విప్లవ రాజకీయాలకు, హింసపూరిత కార్యక్రమాలకు తావు ఉండకూడదన్నారు.
ప్రజలకు ఎలాం టి సమస్యలున్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు ఎస్పీకి పలు సమస్యలు విన్నవించారు. పోలీసులు మీకోసం కార్యక్రమం ద్వారా జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరస్పర సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం గ్రామాల్లోని పలు పాఠశాలల విద్యార్థులకు తిను బండారాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, ఖానాపూర్ సీఐ అజయ్బాబు, కడెం ఎస్ఐ కే రాజు, సర్పంచ్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.