నిర్మల్ అర్బన్, ఆగస్టు 30: గోమయ వసతే లక్ష్మి.. గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. గోమయం అంటే పవిత్రమైన మన దేశీ ఆవు పేడ. దేశంలో మారుతున్న కాలంతో పాటు పురాతన సంప్రదాయాలను ప్రజలు మర్చిపోతున్నారు. పూర్వకాలంలో వినాయక చవితిని జరుపుకునేందుకు మన ఇండ్లలో గోమయం, మట్టితో తయారు చేసిన చిన్న చిన్న విగ్రహాలను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేసేవారు.
ఇప్పుడా పరిస్థితి మారింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించడం మొదలైంది. ఆ తర్వాత వీటిని నదులు, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుండడంతో, పర్యావరణానికి ముప్పులా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోమయ ప్రతిమలను తయారు చేయించి, ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి. క్లిమామ్ ఆధ్వర్యంలో గోమయ వినాయకులను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.
గత ఆరేండ్లుగా అల్లోల దివ్యారెడ్డి ఆధ్వర్యంలో రూ. లక్షలు వెచ్చించి గోమయ వినాయకులను తయారు చేయిస్తున్నారు. సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గోమయ, మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే ఆమెకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
నాసిక్ దేవాలయాన్ని ఆదర్శంగా తీసుకొని..
మహారాష్ట్రలోని నాసిక్లో 17వ శతాబ్దానికి చెందిన ఓ ఆలయంలో గోమయ హనుమంతుడి విగ్రహానికి 400 ఏండ్లుగా భక్తులు పూజలు చేస్తున్నారు. ఇదే గోమయ వినాయక ప్రతిమలు తయారు చేసేలా అల్లోల దివ్యారెడ్డిని ముందుకు నడిపించింది. క్లిమామ్ అంటే కేవలం పాలే కాదని వాటికంటే ఎక్కువ అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
గోమయ విగ్రహం తయారీ ఇలా..
2016 నుంచి క్లిమామ్ ఆధ్వర్యంలో గోమయ వినాయకులను తయారు చేస్తున్నారు. ఒక ఫీట్ నుంచి, రెండు, నాలుగు, ఆరు ఫీట్ల వరకు వివిధ ఎత్తుల్లో వీటిని తయారు చేయించి, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోమయంలో పసుపు, నిమ్మకాయ ఆకుల పేస్ట్, మట్టి, చింతగింజల పౌడర్ కలుపుతారు. ఇందుకోసం పలువురు కళాకారులు చవితికి రెండు నెలల ముందు నుంచి రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. వీటిని నిమజ్జనం చేస్తే పర్యావరణానికి ఎలాంటి హాని లేకపోవడంతో, మండపాల నిర్వాహకులు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
సంస్కృతి, పర్యావరణాన్ని కాపాడేందుకే..
పర్యావరణాన్ని పరిరక్షించి, పురాతన సంప్రదాయాలను తిరిగి తీసుకురావాలనే సంకల్పంతో గోమయ వినాయకులను తయారు చేయిస్తున్నాం. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఆరేండ్లుగా వీటికి మండపాల నిర్వాహకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏటా వారు గోమయ, మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తూ పూజలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 100 గోమయ వినాయకులను పంపిణీ చేశాం. వీటిని ప్రతిష్ఠించేందుకు ప్రజలు కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.
-అల్లోల దివ్యారెడ్డి, క్లిమామ్ నిర్వాహకురాలు