కోటగిరి, ఆగస్టు 29: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)తోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశాలు (పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నెలా మూడో శనివారం సమావేశం నిర్వహించి ప్రతి తరగతిలోని విద్యార్థి తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేసింది. మొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా 1234 పాఠశాలల్లో పీటీఎం నిర్వహించేలా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు చేశారు.
పిల్లల విద్య పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో సజావుగా సాగుతుంది. పాఠశాల అభివృద్ధిలో ఇప్పటి వరకు ఎస్ఎంసీలో ప్రతి తరగతి నుంచి ఎంపికైన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులే పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం పీటీఎంకు శ్రీకారం చుట్టింది. పాఠశాల, విద్యార్థుల సమస్యలు, లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది.
అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే విద్యా క్యాలెండర్లోని అంశాలను పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యం అమలు చేసేలా చూడాలి.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,234 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు. వీటన్నింటీలో ఎస్ఎంసీతోపాటు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు.
విజ్ఞానాన్ని అందించి బంగారు భవిష్యత్కు దారి చూపే పాఠశాలల్లో అందరి భాగస్వామ్యం ఉంటే ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. పాఠశాల యాజమాన్య కమిటీలో ఇప్పటి వరకు కొంతమంది తల్లిదండ్రులే భాగస్వామ్యులయ్యేవారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పీటీఎంలతో అందరూ భాగస్వామ్యమవుతారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం నిర్వహిస్తాం. ప్రతి నెలా మూడో శనివారం పాఠశాలల్లో తప్పనిసరిగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్లు నిర్వహించాలి. సమావేశ నిర్వహణలో మినిట్స్ బుక్ తప్పనిసరిగా నిర్వహించాలి. సమావేశానికి హాజరైన తల్లిదండ్రుల వివరాలను సీఆర్పీల ద్వారా ఎమ్మార్సీకి అందించాలి. మేము జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
-నాగ్నాథ్, ఎంఈవో, కోటగిరి
విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నెలకోసారి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థుల చదువుతోపాటు ఇతర విషయాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.
– అనిత, విద్యార్థి తల్లి, పొతంగల్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విధిగా ప్రతి నెల మూడో శనివారం పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలి. మూడో శనివారం సెలవు దినం అయితే నాలుగో శనివారం సమావేశం నిర్వహించాలి. సమావేశ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ సమావేశాల నిర్వహణలో హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎలాంటి అలసత్వం వహించొద్దు.
-దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్