బాన్సువాడ టౌన్, ఆగస్టు 29: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని ఆ కాలంలో స్వయంకృషితో ప్రపంచంలోనే గొప్ప హాకీ క్రీడాకారుడిగా ఎదిగిన ధ్యాన్చంద్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన జన్మదినం రోజున జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లని పేర్కొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో పురపాలక సంఘం, యువజన, క్రీడా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి స్పీకర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా సంగోజీపేట నుంచి వచ్చిన ‘డప్పు దరువు ’కళా బృందం ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో క్రీడాకారుల కోసం అన్ని వసతులతో స్టేడియం నిర్మించినట్లు తెలిపారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. క్రీడాకారులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన 55 మంది క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులను సభాపతి సన్మానించారు.
కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ ఏజాస్, బుడ్మి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురువినయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మైనారిటీ నాయకులు వాహెబ్, యువజన, క్రీడల సంక్షేమ శాఖ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఎంఈవో నాగేశ్వర్ రావు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బీర్కూర్, ఆగస్టు 29 : రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మె విరమించేలా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్లోని వీఆర్ఏలు సోమవారం స్పీకర్ను ఆయన నివాసంలో కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ సభాపతికి వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మంచి నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు.