మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నది. చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మత్స్య సంపద ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నది. దిగుమతి చేసుకోకుండా స్థానికంగా చేపలను పెంచాలన్న లక్ష్యంతో ప్రతి ఏడాది వానకాలంలో చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో చేపపిల్లలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 2.73కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందించేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది. త్వరలోనే చేపపిల్లలను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి.
నిజాంసాగర్, ఆగస్టు 29: కుల వృత్తిపై ఆధారపడిన మత్స్యకార్మికుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను సరఫరా చేస్తున్నది. రెవెన్యూ, నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాల్లో మరో వారం, పది రోజుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. దీంతో జిల్లాలోని ఆయా మండలాల్లో గల మత్స్యకార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నిజాంసాగర్, కౌలాస్నాలా ప్రాజెక్టులతోపాటు 629 చెరువులు, కుంటల్లో వంద శాతం రాయితీపై 2.73 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 49లక్షల పిల్లలు, కౌలాస్నాలా ప్రాజెక్టులో 9 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తుండగా మిగిలిన చేపపిల్లలను చెరువులు, కుంటల్లో విడుదల చేయనున్నారు. వాటిలో బొచ్చ, రొహు, బంగారు తీగ, మృగాల రకాల చేప పిల్లలు ఉన్నాయి.
ఈ యేడు వర్షాలు ముందస్తుగానే కురిశాయి. నిజాంసాగర్, కౌలాస్నాలా ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని చెరువులు,కుంటలు పూర్తిస్థాయి నీటితో జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఈ సంవత్సరం ముందుగానే చేపపిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేయగా చేపపిల్లల సైజు సక్రమంగా ఉండాలని, విడుదల చేసే చేప పిల్లలను పక్కాగా చూసుకోవాలని, విడుదల చేసే సమయంలో కార్మికులు లెక్కించుకొని విడుదల చేసుకోవాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. మరో వారం, పది రోజుల్లో చేపపిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నుంచి మత్స్యకార్మికులకు వందశాతం రాయితీపై చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. మత్స్య అభివృద్ధి పథకం కింద చేపపిల్లలను విడుదల చేయడంతో వారికి ఉపాధి లభించింది. దీంతో వలస వెళ్లిన మత్స్యకార్మిక కుటుంబాలు చాలా వరకు తిరిగి వచ్చాయి. చేపపిల్లలే కాకుండా మత్స్యకార్మికులకు రాయితీపై తెప్పలు, వలలు, వాహనాలను అందజేస్తున్నారు. గడిచిన ఆరేండ్లలో 16.63 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 45వేల 325 మెట్రిక్ టన్నుల చేపల మార్కెటింగ్ జరిగిందని మత్స్య శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుండడంతో వాటిని వేటాడి గిట్టుబాటు ధరకు విక్రయించుకుంటున్నాం. మద్దతు ధర ఎక్కడ వస్తుందో అక్కడికి తరలించుకునేలా రాయితీపై ఆటోలు, గూడ్స్ వాహనాలు సైతం అందించారు. నాకు ప్రభుత్వం బొలెరో వాహనం అందించింది. నలుగురు, ఐదుగురు కార్మికులందరం కలిసి హైదరాబాద్, నాందెడ్కు చేపలు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం.
– రాములు, మత్స్యకార్మికుడు
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సంవత్సరం నిజాంసాగర్, కౌలాస్నాలా ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలో 629 చెరువులు, కుంటల్లో 2.73 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నాం. చేప పిల్లల విడుదల సమయంలో దగ్గర ఉండి లెక్కించుకొని సైజు సక్రమంగా ఉన్న వాటిని విడుదల చేసేలా చూసుకోవాలని మత్స్యకార్మికులకు తెలిపాం.
-డోలీసింగ్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి