ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. పట్టణాలు మొదలుకొని నుంచి మారుమూల పల్లెల దాకా ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది. దీనిపై కొందరు తప్పుడు ప్రచారానికి తెర లేపడంతో తిప్పి కొట్టేందుకు సర్కారు నడుం బిగించింది. భగీరథ నీటి పరీక్షలు చేయిస్తూ ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
-కోటగిరి, ఆగస్టు 27
ఆరోగ్యానికి స్వచ్ఛమైన జలమే ప్రధానం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఈ దిశగా బృహత్తరమైన పథకం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టింది. లక్షల మైళ్ల మేర పైప్లైన్లు వేసి ఊరూరా వాటర్ ట్యాంకులు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నది. నీటి శుద్ధీకరణ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. స్వచ్ఛమైన తాగునీరు అందడంతో మినరల్ వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి.
దీంతో నీళ్లను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు అసత్యపు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో భగీరథ నీటిపై అసత్య కథనాలను పోస్టు చేస్తున్నారు. అప్రమత్తమైన సర్కారు.. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఊరూరా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీటికి ప్రజలముందే కెమిస్టులతో పరీక్షలు చేస్తున్నారు. భగీరథ నీటి ప్రాధాన్యత, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ఉండే పోషక లవణాల గురించి వివరిస్తున్నారు.
నీటిని సక్రమంగా ఫిల్టర్ చేయకపోవడం.. శుద్ధిచేసే ప్రక్రియలో వాట్ప్లాంట్ల నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నీటిని తాగితే కీళ్లు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. యంత్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇందులో పోషక లవణాలు సైతం తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనది. శరీరానికి కావాల్సిన లవణాలన్నీ ఇందులో ఉన్నాయి. అనవసరంగా మినరల్ వాటర్ జోలికి పోకుండా భగీరథ నీటినే తాగాలి. వాట్సాప్లో వస్తున్న పుకార్లు నమ్మొద్దు.. ఇప్పటికే గ్రామాల్లో భగీరథ నీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-మున్నీనాయక్, డీఈఈ,ఆర్డబ్ల్యూఎస్, బోధన్