బాన్సువాడ, ఆగస్టు 27: దేశంలో అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వృద్ధులకు రూ.2,016 పింఛన్ అందిస్తున్న ప్రభుత్వాలు కూడా లేవన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. బాన్సువాడ మున్సిపల్, రూరల్ పరిధిలో నూతనంగా 1201 మందికి మంజూరైన పింఛన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులతోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 38 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా మరో పది లక్షల మందికి మంజూరైనట్లు తెలిపారు. పాత, కొత్త పింఛన్లను కలుపుకొని మొత్తం 48 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. మన రాష్ట్రం కన్నా పెద్ద రాష్ర్టాలైన ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో కేవలం 12.40 లక్షల మందికి, మన రాష్ట్ర జనాభాకన్నా డబుల్ ఉన్న మహారాష్ట్రలో 31.50 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు. ఆసరా పింఛన్ల కోసం నెలకు రూ.1,250 కోట్ల చొప్పన ఏడాదికి రూ .15 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.
బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో 36 వేల మందికి పెన్షన్లు వస్తుండగా , కొత్తగా మరో 10 వేల మందికి మం జూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ రూ. 2,016, దివ్యాంగులకు ఇస్తున్న రూ. 3,016 పింఛన్లు దేశంలోనే అత్యధికమని అన్నారు. మహారాష్ట్రలో రూ. 500, గుజరాత్లో రూ.600, పంజాబ్లో రూ. 800, తమిళనాడులో రూ. వెయ్యి, కొన్నిరాష్ర్టాల్లో రూ. 200 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే, సగం కుటుంబాలకు ఏదో రూపేణా పింఛన్ అందుతున్నదని చెప్పారు.
రాష్ట్రంలో 5.50 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్ అందుతుందన్నారు. బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. కొంత మంది అంగవైకల్యం లేకపోయినా తమకు పింఛన్ కా వాలని వస్తున్నారని తెలిపారు. జిల్లా దవాఖానలో సదరం శిబిరంలో వైద్యులు పరీక్షలు జరిపి అంగవైకల్యం ఉన్నదని నిర్ధారించి సరిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.
ఆ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే దివ్యాంగుల పింఛన్కు అర్హులని చెప్పారు. డీఆర్డీవో పీడీ సాయన్న, ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ హరిసింగ్, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, గురు వినయ్ కుమార్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మోహన్ నాయక్ పాల్గొన్నారు.