ఆర్మూర్, ఆగస్టు 27 : నవనాథ సిద్ధుల గుట్ట సుందరీకరణ పనులతో ఆర్మూర్ ఖ్యాతిని మరింత పెంచుతామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్లు అన్నారు. మున్సిపల్లోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టలో గల ఘాట్ రోడ్డుకిరువైపులా విద్యుత్ దీపాలాంకరణ పనులకు 40 లక్షల నిధులతో శనివారం ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ పండిత్ వినితాపవన్ భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సిద్ధుల గుట్ట రూపురేఖలు మార్చి సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సిద్ధుల గుట్టను భక్తుల ఇలవేల్పుగా మార్చేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి దారలంగా మంజూరు చేయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ అర్చకులు కుమారశర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘాట్ రోడ్డు పనులకు విద్యుత్ దీపాలాంకరణ పనులకు భూమిపూజ నిర్వహించారు.
సెంట్రల్ లైటింగ్ పనులకు 40 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఆర్మూర్ ప్రాంత ప్రజల దీవెనలు ఎల్లప్పటికీ ఉంటాయని, నవనాథ సిద్ధేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు సంతోషం వెలిబుచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తలారి మీనా చందు, బారడ్ రమేశ్, సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు భారత్గ్యాస్ సుమన్, పీసీ.గంగారెడ్డి, బొబిడె గంగాకిషన్, కొడిగెల మల్లయ్య, నక్కల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.