ఎల్లారెడ్డి, ఆగస్టు27: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ)తో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా సర్వే నిర్వహించి జిల్లాలో రక్త పోటు, మదుమేహం (చక్కెర) వ్యాధులు ఉన్నవారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే 97 శాతం సర్వే పూర్తయింది. బీపీ, షుగర్ ఉన్న 64 వేల మందిని గుర్తించారు. ప్రస్తుతం వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మందులను పంపిణీ చేస్తున్న అధికారులు త్వరలోనే ఎన్సీడీ కిట్స్ను పంపిణీ చేయనున్నారు.
ప్రజల ఆరోగ్య భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో కామారెడ్డి జిల్లాలో సర్వే ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు ఏడాది క్రితం ఇంటింటికీ వెళ్లి విలేజ్ హెల్త్ రిజిష్ర్టేషన్ పూర్తి చేశారు. అనంతరం ప్రతి ఇంట్లో ఉన్న బీపీ, షుగర్ పేషంట్ల వివరాలు తెలుసుకున్నారు. తరువాత స్థాయిలో ఏఎన్ఎంలు పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ ఉన్న వారిని గుర్తించారు. సర్వే 97 శాతం పూర్తికాగా 45917 మంది బీపీ, 19751 మంది మదుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం నుంచి వస్తున్న మందులను ఆరోగ్య శాఖ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు.
క్యాన్సర్ రోగులను గుర్తించేందుకు త్వరలోనే సర్వే ప్రారంభించనున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే మూడు రకాలను సర్వేలో గుర్తిస్తారు. ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ అనే మూడు రకాలను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి గృహిణులకు అవసరమైన ప్రాథమిక పరీక్షలు చేస్తారు. అనుమానం ఉన్న వారికి జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు.
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్తో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు గ్రామ స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నాం. సర్వే చివరి దశలో ఉంది. ఇప్పటికే జిల్లాలో బీపీ, షుగర్ ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన మందులను సరఫరా చేస్తున్నాం. త్వరలోనే ఎన్సీడీ కిట్స్ రానున్నాయి. అవి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేస్తాం.
– డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారిణి, కామారెడ్డి