నిజామాబాద్ క్రైం, ఆగస్టు 27 : రానున్న వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకొనే విధంగా బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ కేఆర్. నాగరాజు సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ కమిషరేట్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల ఏసీపీలు, సీఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగల నేపథ్యంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధుల్లో నిఘా వ్యవస్థను పటిష్ట పర్చాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పీఎస్ల పరిధుల్లో పెట్రోలింగ్ను ముమ్మరంగా నిర్వహించడంతోపాటు బీట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తీసుకోవాలని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించకుండా చూడాలని అన్నారు.
క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టంలో ఎఫ్ఐఆర్, కేసుల పరిశోధనా వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి తదితర కార్యకలాపాలపై నిఘా పెట్టాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, పాత నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీ (ఆపరేషన్స్)ఎమ్.నరేందర్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీసీఎస్ ఏసీపీలు ఏ. వెంకటేశ్వర్, ప్రభాకర్రావు, కిరణ్ కుమార్, నారాయణ, రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి, సీసీఆర్బీ ఎస్సై చంద్రయ్య, సీఐలు, ఎస్సైలు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీపీ నాగరాజు శనివారం ఒక ప్రకటనలో కోరారు. గణేశ్ విగ్రహాలను నెలకొల్పే వారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఇందుకోం http://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని పోలీసు శాఖ అనుమతి పొందవచ్చని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల నుంచి మండపాల వద్ద సౌండ్ సిస్టమ్ను బంద్ చేసి ఉంచాలని సూచించారు.