రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ, బోనాల పండుగలను సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగలుగా గుర్తించి వాటికి సంబంధించిన ఏర్పాట్లను సర్కారే వైభవంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిలువుటద్దం లాంటి బతుకమ్మ అంటే ఆడబిడ్డలకు భారీ ఉత్సాహం నింపే పండుగ. యువతులు, మహిళలకు సరదాలను పంచుకునే వేడుక. ఆటాపాటలతో, కోలాహలంగా సాగే పూల పండుగ రోజు ఆడబిడ్డలకు సర్కారు తరఫున చీరలను కానుకల రూపంలో అందించే ప్రక్రియ 2017 నుంచి మొదలైంది. వరుసగా ఆరోసారి ఈ కార్యక్రమం జోరుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సిరిసిల్లా చేనేత మగ్గాలపై కోట్లాది మీటర్ల అందమైన రంగుల్లో, భిన్నమైన డిజైన్లలో చీరలు రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మ ఉత్సవ సమయం ఆసన్నమవుతున్న తరుణంలో చీరల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా ఇందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఆగస్టు చివరి నాటికి జిల్లాకు చీరలు చేరనున్నాయి. సెప్టెంబర్లో పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు. పండుగకు ఐదు రోజుల ముందే చీరలను మహిళలకు అందిస్తారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారు. తొలిసారి మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తెలంగాణ సర్కారు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకంగా వాటిని అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నది. 2017, ఆగస్టు నెలలో మొదలు పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీని వరుసగా ఆరో ఏటా కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 18ఏండ్లు నిండిన యువతులతోపాటు మహిళలందరికీ చీరలను బతుకమ్మ సారెగా సర్కారు తరఫున అందిస్తున్నారు. ఖర్చు ఎంతైనా నాణ్యమైన చీరలను పంపిణీ చేసేలా సర్కారు చర్యలు తీసుకుంది. చేనేత కార్మికులకు రోజంతా పని లభించేలా చర్యలు చేపట్టింది. సిరిసిల్లలోని వందలాది మంది చేనేత కుటుంబాల జీవితాల్లో బతుకమ్మ చీరల తయారీ వెలుగులు నింపుతున్నది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో దసరా పండుగకు ముందే ఇటు చేనేత కార్మికులు, మరోవైపు తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషం వ్యక్తం చేస్తుండడం విశేషం. తెలంగాణ ఆడపడుచుల శ్రేష్ఠమైన పర్వదినం బతుకమ్మకు ప్రభుత్వమే సారె రూపంలో చీరను అందివ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 4లక్షలకు పైగా మహిళలకు చీరలు అందించనున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 3.41లక్షల మందికి చీరలను పంపిణీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే చీరలను వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు మండలాల వారీగా సరఫరా చేస్తారు. బతుకమ్మ పండుగలోపే చీరలు పంపిణీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. గతం మాదిరిగానే ఈసారి బతుకమ్మ చీరలను రెండుసైజుల్లో తీర్చిదిద్దారు. 6.3 మీటర్ల చీర, 9మీటర్ల చీరలు అందుబాటులోకి తెచ్చారు. 6.3మీటర్ల చీరలో జాకెట్ 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలకు గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల నుంచి స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్ కానుకగా వస్తున్న చీరలను ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు. గతంలో ఎన్నడూ పండుగలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసిన దాఖలాలే లేవని గుర్తు చేసుకుంటున్నారు.