మోస్రా (చందూర్), ఆగస్టు 23 : పేదోడే తనకు బంధువని, కుల మతాలు, పార్టీలతో తనకు సంబంధం లేదని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పా రు. మంగళవారం ఆయన మోస్రా మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మోస్రాకు చేరుకున్న స్పీకర్కు గజమాలతో సన్మానించారు. మోటాడిరెడ్డి సంఘ భవన నిర్మాణంతోపాటు బస్టాండ్ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్, ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మైనార్టీలతో స్పీకర్ మాట్లాడుతూ..సంఘ భవన నిర్మాణానికి సాయం అందజేస్తానని హామీ ఇచ్చా రు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభిం చి, ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఇండ్లులేని వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేస్తామన్నారు. శిథిలావస్థలో ఇండ్లు, రేకుల షెడ్డులో ఉన్నవారు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోస్రా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తమకంటూ ఒక లక్ష్యం ఏర్పర్చుకొని ఆ దిశగా కష్టపడాలని సూచించారు. ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
మండల కాంప్లెక్స్ , జనరల్ ఫంక్షన్హాలు నిర్మాణ పనులకు స్పీకర్ శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మోస్రా గ్రామంలో ఇప్పటికే రూ.35 లక్షలతో షాదీఖాన నిర్మించినట్లు తెలిపారు. రూ.25 లక్షలతో రెడ్డి సంఘ భవనం, రూ.30 లక్షలతో జనరల్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఉమ్మడి మండలంలో మండల కాంప్లెక్స్ భవనం కోసం రూ.కోటీ 30 లక్షలు, ఆర్ అండ్బీ రోడ్ల నిర్మాణానికి రూ.3.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మోస్రాలో రూ. ఆరు కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీలో త్వరలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులకు అందజేస్తామన్నారు. పూర్తయిన ఇండ్ల వద్ద డ్రైనేజీ పనులు పూర్తిచేస్తామన్నారు. మారమ్మ ఆలయానికి రూ. 5లక్షలు మంజూరు చేశామన్నారు. పంట పొలాలకు వెళ్లడానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 90 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని చెప్పారు. అనంతరం పలువురికి వృద్ధాప్య పింఛన్ మం జూరు పత్రాలను స్పీకర్ పోచారం అందజేశారు. ఇదే వేదికపై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
45 ఏండ్లుగా ప్రజల మధ్యే ఉన్నా..
తాను ప్రజల మనిషినని, 45 ఏండ్లుగా ప్రజల మధ్యే ఉన్నానని స్పీకర్ పేర్కొన్నారు. తనకు మంచి చేయడం తప్ప చెడు చేయడం రాదన్నారు. తనను తప్పు పట్టేవారు సలహాలు ఇవ్వాలని.. కానీ తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. గుజరాత్లో పదేండ్ల క్రితం జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను స్వాతం త్య్ర దినోత్సవం రోజున విడుదల చేయగా, వారికి పూల దండలు వేశారని.. సమాజం ఎటుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పని చేయరు.. చేసేవారిని చెడిపేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
గోవూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాయం త్రం గోవూర్లో పర్యటించారు. జనరల్ ఫంక్షన్ హాలు, జడ్పీహెచ్ఎస్ ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక పాఠశాల భవనం, ముదిరాజ్ సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పంట పొల్లాలకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, జడ్పీటీసీ గుత్ప భాస్కర్ రెడ్డి , ఎంపీపీ పిట్ల ఉమ, తహసీల్దార్ సాయిలు, ఎంపీటీసీ మమత, సర్పంచ్ సుమలత, నరేందర్ రెడ్డి, సాయరెడ్డి, సత్యనారాయణ, విమల లింగయ్య, సున్నం భూమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.