నిజామాబాద్ క్రైం, ఆగస్టు 19: పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ఓ ఏఎస్సై రూల్స్ బ్రేక్ చేసి, రాంగ్ రూట్లో కారు నడుపుతూ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఫారెస్ట్ ఆఫీసు ప్రాంతంలో చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి 2వ టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని నాగారం పరిధిలో గల కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులను వారి ఇండ్లకు చేరవేసేందుకు టాటా మ్యాజిక్ వర్ని రోడ్డు నుంచి న్యాల్కల్ రోడ్డు వైపు బయల్దేరింది. అదే సమయంలో రాంగ్ రూట్లో కారు నడుపుకుంటూ వచ్చిన రిటైర్డ్ ఏఎస్సై శంకర్ విద్యార్థుల ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు వారిని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ ఏఎస్సై సంఘటనా స్థలం నుంచి తప్పించుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ ఏఎస్సైను తీసుకురావాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సమయం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారికి నచ్చజెప్పారు. విషయం తెలియడంతో ఎస్సై పూర్ణేశ్వర్ దవాఖానకు చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ రియాజ్ ఫిర్యాదు మేరకు రిటైర్డ్ ఏఎస్సై శంకర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. మద్యం సేవించి కారు నడిపినట్లు స్థానికులు ఆరోపించడంతో పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు.