ఇందూరు/ ధర్పల్లి/ఇందల్వాయి/ కమ్మర్పల్లి/బాల్కొండ/ ఆర్మూర్/ మాక్లూర్/ ముప్కాల్/నవీపేట/ డిచ్పల్లి/ సిరికొండ, ఆగస్టు 19 : జిల్లావ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాలల్లో వేడుకలను నిర్వహించగా.. పాఠశాలల్లో చిన్నారులు చిన్నికృష్ణుడు, గోపికల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. పలుచోట్ల గోపాలకాల్వ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న గీతాభవన్లో వేడుకలను ఆలయ చైర్మన్ శెనిశెట్టి కిషన్గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజు పంతులు ఆధ్వర్యంలో ధ్వజారోహణం, భగవద్గీత, ఉపనిషత్తుల పారాయణం, లక్ష తులసీదళం పుష్పార్చన తదితర కార్యక్రమాలు కొనసాగాయి.
నగరంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో ఇస్కాన్ -నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇస్కాన్ 18వ వార్షికోత్సవం, కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించినట్లు ఇస్కాన్ జిల్లా అధ్యక్షుడు సిద్ధ బలరాందాస్ తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని రావూజీ సంఘం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఉత్తమ అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షుడు పోతన్కర్ చంద్రశేఖర్, కరిపె గోవర్ధన్, కోశాధికారి కరిపె శంకర్, ప్రిన్సిపాల్ రవికుమార్ పాల్గొన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన్న పాఠశాల స్కూల్, న్యూ ఎన్జీవోస్ కాలనీలోని విజ్ఞాన్ పాఠశాల, జేవియర్స్, అభ్యాస, విజయ్ పాఠశాల, టైమ్స్ కిడ్స్ ప్యూచర్ స్కూల్, కాకతీయ, వీఎన్ఆర్ పాఠశాలల్లో విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
ధర్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులను వాహనాలపై కూర్చోబెట్టి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గాంధీ ధర్మశాల వద్ద వీడీసీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఒడ్డెర కాలనీకి చెందిన యువకులు ఉట్టి కొట్టి విజయం సాధించారు. వీడీసీ చైర్మన్ చెలిమెల రంజిత్, ఉపాధ్యక్షుడు గంగాధర్, వీడీసీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో యువకులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కృష్ణవేణి, ఉషోదయ, విజ్ఞానజ్యోతి పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలతో అలరించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.బాల్కొండ మండలంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుడి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. మోడల్ పాఠశాలల్లో చిన్నారుల వేషధారణలతో ఆకట్టుకున్నారు.
ఆర్మూర్లోని శ్రీభాషిత, నలంద, క్షత్రియ ఇంజినీరింగ్, జెంటిల్కిడ్స్, లిల్లిఫుట్, ఆలూర్లోని లిటిల్ఫేర్ తదితర పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్, కౌన్సిలర్లు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మాక్లూర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు చిన్నికృష్ణుని, గోపికల వేషాధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.ముప్కాల్ మండలంలోని వేంపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో వేంపల్లి సర్పంచ్ జక్క మల్లుబాయి, ఉప సర్పంచ్ జక్క గంగాధర్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.నవీపేట మండల కేంద్రంతోపాటు లిటిల్ ఫ్లవర్, స్కాలర్ హైస్కూళ్లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్లు హన్మాండ్లు, శ్రీనివాస్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.డిచ్పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్రావు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.