జాతీయ గీతం మార్మోగింది. దేశభక్తి వెల్లివెరిసింది. ఒకవైపు మువ్వన్నెల రెపరెపలు.. మరోవైపు జనగణమన గీతాలాపనతో ప్రతి పౌరుడి మది పులకించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. సరిగ్గా ఉదయం 11.30 గంటలు కాగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘జన గణ మన..’ మార్మోగింది. పొలం పనుల్లో నిమగ్నమైన వారు.. ప్రయాణాల్లో ఉన్న వారు.. ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రయాణంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మార్గమధ్యంలో తమ వాహనాన్ని నిలిపి రోడ్డుపైనే జనగణమన పాడారు. సామూహిక గీతాలాపనలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా భారత జాతీయ గీతం జనగణమన ఆలాపనతో ఊరూ.. వాడా.. పల్లె, పట్నం దద్దరిల్లింది. సరిగ్గా 11.30 గంటలకు జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, పట్టణాల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలంతా ఎక్కడికక్కడ నిల్చొని, జాతీయ జెండాకు వందనం చేస్తూ జనగణమన గీతాన్ని ఆలపించి జాతీయతా స్ఫూర్తిని చాటారు.