నిజామాబాద్, ఆగస్టు 15,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజుతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. 32 శాఖల్లో సాధించిన జిల్లా ప్రగతిని వివరించారు. మరిన్ని వివరాలు మంత్రి ప్రశాంత్రెడ్డి మాటల్లో మీ కోసం..
రైతుకు వెన్నుదన్ను..
రైతుబంధు పథకం కింద 2022-23 వానాకాలం సీజన్కు 2,60,333 మంది రైతులకు రూ.267.26 కోట్లు జమ చేశాం. ఇప్పటి వరకు రైతుబంధు కింద జిల్లాకు రూ.2,120.90కోట్లు అందించింది. రైతులు మరణిస్తే బాధిత కుటుంబానికి రైతు బీమా పథకం ద్వారా రూ.5లక్షలు సాయం అందిస్తోంది. 2021-22లో 844 మంది రైతులు మృతి చెందగా రూ.42.20కోట్లు బీమా సొమ్మును నామినీ ఖాతాలో జమ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3749 రైతు కుటుంబాలకు రూ.145.25కోట్లు అందించారు. రూ.25వేలలోపు రుణం పొందిన 17,711 మంది రైతులకు రూ.20.10కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.50వేలలోపు రుణం పొందిన 27,601 మంది రైతులకు రూ.85.85 కోట్లు మాఫీ చేసింది. కొత్తగా 19 వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోదాములు, పాతవి 34 గోదాములతో జిల్లాలో 1,42,140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 54 గోదాములు రైతులకు అందుబాటులో ఉన్నాయి.
జవజీవాలు..
2021-22లో 12.50 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో 4.16కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి అయ్యింది. 77.92 లక్షల చేప పిల్లలను నిజామాబాద్ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారు. 2022-23లో 10కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా 3కోట్ల చేప పిల్లలను ఇప్పటి వరకు ఉత్పత్తి చేశారు. రూ.2.22 కోట్లతో 85.57లక్షల రొయ్య పిల్లలలను 24 చెరువుల్లో వదలగా ఈ సంవత్సరం 4.85కోట్ల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాము. గొల్ల, కుర్మలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు 2017-18 నుంచి ఇప్పటి వరకు 10,722 యూనిట్లు రూపంలో 2,25,162 జీవాలను రాయితీపై అందించాము. 1,76,064 జీవాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాము.
వందల కోట్లతో పట్టణ ప్రగతి..
పట్టణ ప్రగతిలో నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో రూ.116.07 కోట్లు మంజూరు చేశాం. నిజామాబాద్ నగరానికి రూ.38.33కోట్లు కేటాయించాము. 227 సీట్ల టాయిలెట్లు, 2 బస్ టాయిలెట్లు, పారిశుద్ధ్య యంత్రాలు, 16 వైకుంఠ ధామాలు నిర్మాణం, 2 వైకుంఠ రథాలు, 32 ఓపెన్ జిమ్ములు, 1734 కొత్త ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్ పోల్స్, 6లక్షల మొక్కల సెంట్రల్ నర్సరీ, జైల్ నర్సరీ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు చేపట్టాం. బోధన్ మున్సిపాలిటీలో రూ.1.60 కోట్లతో 20 ఆటో టిప్పర్లు, రూ.82 లక్షలతో స్వీపింగ్ మిషిన్లు, రూ.15లక్షలతో వైకుంఠరథాలు, రూ.50 లక్షలతో వైకుంఠధామాలు అభివృద్ధి చేస్తున్నాం. ఆర్మూర్లో 5 క్రీడా ప్రాంగణాలు, రూ.13లక్షలతో బస్తీ దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భీంగల్లో రూ.30లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు, శానిటేషన్ కోసం జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, వాటర్ ట్యాంకర్లు, ఫాగింగ్ మిషిన్లు, స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశాం.
ధర్మోరా లిఫ్ట్ మంజూరు..
రూ.9.54కోట్లతో నిజాంసాగర్ ప్రాజెక్టు 15 ప్రధాన, ఉప కాలువల ఆధునికీకరణకు నిధులు విడుదల చేశాం. నిజామాబాద్ జిల్లాలో 8 పనులు పూర్తి చేసి రూ.4.13కోట్లు వెచ్చించాం. చెరువులను పునరుద్ధరించి సాగు విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో 1147 చెరువులకు గాను 676 చెరువులు పునరుద్ధరణ చేపట్టాం. 52 చెక్ డ్యామ్లలో రూ.162కోట్లతో 32 చెక్డ్యామ్లు మంజూరు చేశాం. రూ.11.71కోట్లతో నిజాంసాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందించే ఉద్దేశంతో మాక్లూర్ మండలం ధర్మోరా చెరువు ఎత్తిపోతల పథకం మంజూరు చేశాం. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 3 ఎత్తిపోతల ద్వారా వరద కాలువను నింపి తాగు, సాగు నీరు అందించేందుకు రూ.1999.56 కోట్లు మంజూరయ్యాయి. దీనిలో 3 క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించి 8 పంపులను అమర్చి 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నాం..
వేగంగా కాళేశ్వరం పనులు..
ప్రభుత్వం రూ.892 కోట్లతో సారంగపూర్ సర్జిపూల్ వద్ద ప్యాకేజీ 20 కింద 3 పంపులను మంజూరు చేయగా పంప్ హౌస్ బిగించే పనులు పురోగతిలో ఉన్నాయి. మంచిప్ప వద్ద 2 పంపుల నిర్మాణానికి ప్యాకేజీ 21కింద రూ.545 కోట్లతో సర్జిపూల్ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తి పోసేందుకు మంజూరు కాగా మోటార్ డిజైన్లు ఆమోదం కోసం జెన్కో పరిశీలనలో ఉన్నది. రూ.2413.53 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసి కొండెం చెరువులో నీటిని వదలడానికి ప్రెజర్ మెయిన్స్ వేసే పనులు, ప్యాకేజీ 21ఎలో భాగంగా 25మెగా వాట్ల సామర్థ్యంతో మెట్పల్లి సెగ్మెంట్ పంప్ హౌస్ నిర్మాణం, మెంట్రాజ్పల్లి వద్ద పంపులు బిగింపు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నెట్వర్క్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ 21ఎలో భాగంగా 16మెగా వాట్స్ సామర్థ్యంతో గడ్కోల్ సెగ్మెంట్ పంప్ హౌస్ నిర్మాణం, నెట్వర్క్ పైప్లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 35 లిఫ్టులు ద్వారా 59వేల 231 ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
ధాన్యం సేకరణలో టాప్..
నిజామాబాద్ జిల్లాలో 2021-22 యాసంగిలో 460 కేంద్రాల ద్వారా 6లక్షల 35వేల 905 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 81,239 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1238.59 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. జిల్లాలో 4లక్షల 5వేల 314 ఆహార భద్రత కార్డుల ద్వారా సెప్టెంబర్ 2021 నుంచి జులై 2022 వరగకు 1,30,685 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశాం. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటిస్థానంలో ఉంది.
సహజ ప్రసవాలకు ప్రోత్సాహం..
ప్రభుత్వ దవాఖానల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్ పథకం అమలవుతోంది. 2022-23లో 3242 కేసీఆర్ కిట్లు అందించాం. కొవిడ్ వాక్సినేషన్లో జోరుగా కొనసాగుతోంది. కొవిడ్తో ఐదుగురు వైద్యులు మృతి చెందగా ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పన మొత్తం రూ.2.50 కోట్ల ఎక్స్ గ్రేషియాను వారి వారసుల ఖాతాలో జమ చేశాం. కొవిడ్తో 1341 మంది సాధారణ ప్రజలు మరణించగా మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున రూ.6.70కోట్లు అందజేశాం. 2021 జూన్ 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా రోగ నిర్ధ్దారణ వేగంగా జరుగుతోంది. జిల్లాలో 1156 పాఠశాలలకు మొదటి విడుత ‘మన ఊరు-మన బడి’లో 407 పాఠశాలలకు రూ.160కోట్లతో పనులు చేపట్టాం. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 7లక్షల 50వేల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం.
14వేల ఇండ్లు మంజూరు..
నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం 14,825 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 14,797 ఇండ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. 12,827 ఇండ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా ఇప్పటి వరకు 2,569 ఇండ్లు పూర్తి చేశాం. మిగిలిన 10వేల 258 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. మొత్తం రూ.217 కోట్లు ఖర్చు చేశాం. జిల్లాలో సింగిల్ లేన్ రహదారిని డబుల్ లేన్గా మార్చి నూతన వెంతెనల నిర్మాణం చేపట్టాం. 269 పనులు రూ.1194 కోట్లతో మంజూరు కాగా 174 పనులు పూర్తయ్యాయి. 95 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.774.92 కోట్లు ఖర్చు చేశాం. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి రూ.58.70 కోట్లు అంచనాతో మంజూరు కాగా రూ.50.74కోట్లు వెచ్చించాం. రూ.6.15కోట్లతో న్యాక్ భవనం మంజూరు చేసి రూ.2.28కోట్లతో పని పురోగతిలో ఉంది. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 2743 పనులు రూ.145.94కోట్లు అంచనా మంజూరు కాగా 2618 పనులు పూర్తి చేశాం.
ఆర్థిక చేయూత..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద జిల్లాలో 2022-23లో 281 మందికి లబ్ధి చేకూరింది. 38వేల మందికి ఇప్పటి వరకు పథకం వర్తించింది. షాదీముబారక్ పథకం కింద 15వేల మందికి సాయం అందింది. నిజామాబాద్ జిల్లాలో 6 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.302కోట్లతో పెట్టుబడితో నెలకొల్పారు. 1471 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు రూ.598.53 కోట్లు పెట్టుబడితో స్థాపించబడ్డాయి. వీటి ద్వారా 14వేల మందికి ఉపాధి లభించింది. పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు వివిధ రాయితీలను టీఎస్ ఐపాస్ కింద ఎస్సీ వర్గానికి 28 మంది ఔత్సాహికులకు, ఎస్టీ వర్గానికి చెందిన 40 మంది ఔత్సాహికులకు రాయితీ అందించాం. జిల్లాలో నూతనంగా 10 సబ్ స్టేషన్లు 33/11 కేవీ మంజూరయ్యాయి. వాటిలో 9 పూర్తి కాగా మిగిలినవి అనుమతుల దశలో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కోసం 1793 దరఖాస్తులు రాగా వాటిలో 1547 విద్యుత్ కనెక్షన్లు మంజూరు అయ్యాయి.