కమ్మర్పల్లి, ఆగస్టు 15 : మోసపూరిత హామీలతో రైతులను దగా చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతుల పేరిట ధర్నా చేయడం సిగ్గు చేటని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, ఎర్రజొన్న, చెరుకుకు మద్దతు ధర ఇప్పిస్తానని ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి, తప్పించుకు తిరుగుతూ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల పేరిట ధర్నా చేస్తున్నావని ప్రశ్నించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద మంగళవారం అర్వింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో ఆయన రైతులకు ఇచ్చిన హామీలతోపాటు పలు అంశాలను బాల్కొండ, ఆర్మూర్ రైతులకు వివరిస్తూ మంత్రి వేముల సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. అర్వింద్ తలపెట్టిన ధర్నాకు రైతులు మద్దతు తెలుపవద్దని ఆయన కోరారు. మోసపు హామీల నుంచి రైతులను పక్కదోవ పట్టించేందుకే అర్వింద్ ధర్నాకు పూనుకున్నాడని ఆరోపించారు.‘నీ మోసపు మాటలను రైతులు ఇంకా నమ్ముతారా’ ? అని అర్వింద్ను మంత్రి వేముల ప్రశ్నించారు.
రైతులను గందరగోళానికి గురి చేసే కుట్రలో భాగంగానే ధర్నా చేస్తున్నావంటూ దుయ్యబట్టారు. ఎంపీగా గెలిచిన అర్వింద్ ఒక్క హామీనైనా నెరవేర్చాడా.. ఈ విషయంపై ఆర్మూర్, బాల్కొండ ప్రాంత రైతులు ఆలోచించాలని మంత్రి కోరారు. అర్వింద్ మాటలు నమ్మితే మరో సారి మోస పోతామని గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు పై మాట్లాడుతున్న అర్వింద్.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి నిలదీశారు.
రైతులకు అండగా సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలోని రైతుల కోసం సీఎం కేసీఆర్ అన్ని చేస్తున్నారని మంత్రి వేముల గుర్తు చేశారు. పంట పెట్టుబడికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.2, 120 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశారని వివరించారు. రైతు మరణిస్తే రూ.5 లక్షల చొప్పున 3,749 రైతు కుటుంబాలకు రూ.146 కోట్లు ఇప్పటికే ఇచ్చామన్నారు. కేంద్రం సహకరించకున్నా జిల్లాలో 460 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు రూ.20 వేల కోట్ల విలువైన పంటలు కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం నిర్మించి వరద కాలువ, కాకతీయ కాలువ మూడు కాలాలు నిండుగా ఉండేలా మార్చారని అన్నారు. దశాబ్దాలుగా ఎదుర్కొన్న సాగు నీటి కష్టాలు, నష్టాలు తీరి పోయిన అనుభవం రైతుల మనసు నిండా ఉన్నదని చెప్పారు. ఎండా కాలం సైతం గుత్ప, అలీ సాగర్ లిఫ్టులతో నీళ్లు నింపుకొంటున్నామని..ఈ ఫలితాలు రైతుల కండ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయన్నారు. తనతోపాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై అర్వింద్ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతులు గమనించాలని కోరారు.
వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద మంగళవారం ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాపై బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం దుబ్బాకలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే ఇక్కడికి రావాలంటూ ఎమ్మెల్యే రఘునందన్రావు పర్యటనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
– వేల్పూర్, ఆగస్టు 15