విద్యానగర్, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి బస్తీ దవాఖానను కామారెడ్డిలోనే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్తీ దవాఖానను పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు వన మహోత్సవంలో పాల్గొననున్న మంత్రి వేముల
వేల్పూర్, ఆగస్టు 9 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో(వేల్పూర్ ఎక్స్ రోడ్, పెట్రోల్ పం పు సమీపంలో) బుధవారం నిర్వహించనున్న వన మ హోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొననున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు మంత్రి వేముల పాల్గొని మొక్కలు నాటుతారు.