రుద్రూర్/ ఎడపల్లి/ రెంజల్, జూలై 3 : జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వనభోజనాలకు తరలివెళ్లారు.
రుద్రూర్ మండలంలోని రాయకూర్లో గ్రామస్తులు బోనాలను ఊరేగించారు. గ్రామంలోని అన్ని దేవతామూర్తులకు భక్తులు నైవేద్యాలు సమర్పించేందుకు డప్పువాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాలతో తరలివెళ్లారు. ఊరంతా భక్తిశ్రద్దలతో సంతోషంగా గ్రామపెద్దల సమక్షంలో పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బేగరి గంగారాం, ఉపసర్పంచ్ గంగారాం, ఎంపీటీసీ సభ్యుడు హన్మంత్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపులో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు బోనాలను గ్రామంలోని ప్రధానవీధుల గుండా ఊరేగించి పెద్దమ్మ తల్లికి సమర్పించారు. నైవేద్యాలు సమర్పించి, పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రెంజల్ మండలకేంద్రంలోని మైసమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించి మైసమ్మకు సమర్పించారు. పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వనభోజనాలకు తరలిన గ్రామస్తులు
ఇందల్వాయి/ ఏర్గట్ల/ మాక్లూర్, జూలై 3 : ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, గౌరారంతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం వనభోజనాలకు తరలివెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పస్కరాజులకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు.
ఏర్గట్ల మండలకేంద్రంలో ప్రజలు వన భోజనాలకు తరలి వెళ్లారు. ముందుగా వీడీసీ సభ్యులు, గ్రామస్తులు గ్రామదేవతల ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వానలు కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు. అనంతరం వనభోజనాలకు వెళ్లారు.
మాక్లూర్ మండలంలోని మాదాపూర్, ముల్లంగి(బీ) మాందాపూర్ తదితర గ్రామాల్లో వనభోజనాల సందడి కనిపించింది. వీడీసీల ఆధ్వర్యంలో సార్గాలమ్మ, మహాలక్ష్మమ్మ, పోచమ్మ తదితర దేవతలకు గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవలతకు గొర్రెలు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామశివార్లలోకి వన భోజనాలకు వెళ్లారు.