నిజామాబాద్ లీగల్, జూలై 2 : విద్య.. విద్యార్థుల వికాసానికి, భవిష్యత్తు జీవన నిర్మాణానికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘బాలలకు స్నేహపూర్వక న్యాయసేవలు, రక్షణ’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరైర మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జూనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ తన కూతురును ఇదే పాఠశాలలో చదివించడం న్యాయవ్యవస్థకే గర్వకారణమన్నారు. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
అనంతరం డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్, నిజామాబాద్ ఆర్డీవో రవి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రం మాట్లాడారు. పాఠశాలకు న్యాయసేవా సంస్థ వితరణ చేసిన సీసీ కెమెరాలను జిల్లా జడ్జి సునీత, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో దుర్గాప్రసాద్, ఆర్డీవో రవి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, మైక్సెట్ను అందజేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు అజయకుమార్ జాదవ్, సౌందర్య, భవ్య, గిరిజ, ఎంఈవో రామారావు, ప్రధానోపాధ్యాయుడు రాంగోపాల్రెడ్డి, నిజామాబాద్ రూరల్ సీఐ జగడం నరేశ్, సబ్ ఇన్స్పెక్టర్ లింబాద్రి, జిల్లా కోర్టు లైజనింగ్ అధికారి శ్యాం, న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, ఆశ నారాయణ, మాణిక్రాజ్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.