నవీపేట, జూన్ 29 : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పగటి కలలు కంటున్నదని, ఇందులో భాగంగానే యువతలో అపోహలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. మండలంలోని జన్నేపల్లి గ్రామంలో శివాలయం నుంచి గ్రామశివారు వరకు రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అర్వింద్.. జిల్లాకు ఒక్క రూపాయి తెచ్చి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జిల్లాలో ఏం అభివృద్ధి చేశారో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గతంలో ఎంపీగా కొనసాగిన కల్వకంట్ల కవిత జిల్లాను కోట్లాది రూపాయలతో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అడ్డదారిలో అధికారంలోకి రావడమే ప్రధానలక్ష్యంగా బీజేపీ పనితీరు కొనసాగుతుందని దుయ్యబట్టారు.
మహారాష్ట్రతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ ఇతర రాష్ట్రాలపై పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని విమర్శించారు. జన్నేపల్లి గ్రామాభివృద్ధికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు కృషిచేస్తున్నారని అన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.40 లక్షలు మంజూరు చేయించారని చెప్పారు. జన్నేపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు. త్వరలోనే జన్నేపల్లి మండలంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అనంతరం ఆయన స్థానిక శివాలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే షకీల్కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
సొంత గూటికి లింగాపూర్ సర్పంచ్
నవీపేట మండలం లింగాపూర్ సర్పంచ్ బత్తూరు సాయిలు బోధన్ ఎమ్మెల్యే సమక్షంలో గోసంగి సంఘం మండల అధ్యక్షుడు కల్లెం రాములుతోపాటు సుమారు 50 మంది అనుచరులతో బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ చేరిన లింగాపూర్ సర్పంచ్తోపాటు ఆయన అనుచరులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. బీజేపీ మోసపూరిత వాగ్దానాలతో కొన్నిరోజుల క్రితం ఆ పార్టీలో చేరినట్లు సర్పంచ్ తన ముందు ఆవేదన వ్యక్తం చేశారని, మతద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ తీరు నచ్చక తిరిగి తన తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు నీరడి సవితా బుచ్చన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, వైస్ఎంపీపీ ఇందూరు హరీశ్, సర్పంచ్ క్యామాజీ సబితా సంజీవ్రావు, ఎంపీటీసీ సభ్యురాలు బట్టు రాణీ లక్ష్మణ్ రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాణికేశ్వర్రావు, ఉపసర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ రచ్చ సుదర్శన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, పృథ్వీరాజ్, మల్లెపూల గంగాధర్, నవీపేట్ సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న, బినోల సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, ఎంపీడీవో గోపాలకృష్ణ, పీఆర్ ఏఈ శ్రావణ్ పాల్గొన్నారు.