బీర్కూర్, జూన్ 24 : పనిచేసే వారినే ప్రజలు ఆదరిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు బాన్సువాడలో నిర్మించామని, కానీ కొందరు తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే సహించేదిలేదని ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు. మండలంలోని భైరాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను శుక్రవారం ప్రా రంభించారు. ముందుగా మల్లాపూర్ గ్రామంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్ల ను ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు.
జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్ తన సొంత ఖర్చుతో సుమారు రూ.4 లక్షల విలువగల ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేయగా..సభాపతి పోచారం చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ రాంసాని పోశవ్వ, పంచాయతీ కార్యదర్శి అనితకు అందజేశారు. అనంతరం స్పీకర్ భైరాపూర్కు చేరుకున్నారు. గ్రామంలో రూ.ఏడున్నర లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ.21 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ.20 లక్షలతో ముదిరాజ్ సంఘ భవనం, డబుల్ బెడ్ రూం కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైనేజీలతోపాటు రూ. 5 లక్షలతో నిర్మించిన ఈద్గా షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. రాజకీయమనేది ప్రజలు ఇచ్చే వజ్రాయుధమన్నారు.
దానితో వ్యాపారం చేయాలని కొన్నిపార్టీల నాయకులు చూస్తున్నారని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు పనిచేసే వారిని ఆదరిస్తారని, చేయని వారిని తిరస్కరిస్తారని అన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల మాదిరిగానే బాన్సువాడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ముందుగా 1400 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరుచేశారని, ఇందులో నుంచే భైరాపూర్ గ్రామానికి మొదటగా 40 ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లకు శ్రీకారం చుట్టింది భైరాపూర్ గ్రామంలోనే అని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గానికి రెండో విడుతలో వెయ్యి, మూడో విడుతలో మరో వెయ్యి, నాల్గో విడుతలో 600, ఐదో విడుతలో వెయ్యి, ఆరో విడుత లో ఒకేసారి ఐదువేల ఇండ్లను మంజూరుచేయించుకున్న మొదటి ఎమ్మెల్యేగా పేరుతెచ్చుకున్నట్లు వివరించారు. 119 నియోజకవర్గాల్లో 10 వేల ఇండ్లను తెచ్చుకున్న నియోజకవర్గం బాన్సువాడ ఒక్కటేనని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మరో ఐదువేల ఇండ్లను తెస్తానని భరోసా ఇచ్చారు.
మనిషి ఆశకు అవధులు లేవు: కలెక్టర్
మనిషి ఆశకు అవధులు లేవని, ప్రభుత్వం ఎంత ఇచ్చినా మనుషుల్లో ఆశ చావడం లేదని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించాలని, దానికోసం బాగా చదివించాలన్నారు. వారి బంగారు భవిష్యత్తే మీ ఆస్తిపాస్తులని కలెక్టర్ వివరించారు. కార్యక్రమాల్లో మల్లాపూర్, భైరాపూర్ సర్పంచులు రాంసాని పోశవ్వ, గుమ్మ అంజవ్వ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ తనబుద్ది స్వరూప, ఎంపీటీసీ బేగరి లక్ష్మి, ఏఎంసీ చైర్మ న్ ద్రోణవల్లి అశోక్, ఆర్డీవో రాజీగౌడ్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు మద్దినేని నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, కో-ఆప్షన్ మెంబర్ ఆరీఫ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, సొసైటీ చైర్మన్ రామకృష్ణాగౌడ్, గిర్దావర్ సురేందర్రెడ్డి, ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శులు సౌందర్య, అనిత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అబద్ధాలు చెప్పే నా యకులకు జనం బుద్ధిచెబుతారు
బీర్కూర్లో ఇటీవల నిర్వహించిన సభలో స్థానిక మా జీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ ఇంటికి రూ.లక్ష నుంచి రూ.లక్షా 50వేలు లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటున్నాడని ఓ నాయకుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని స్పీకర్ అన్నారు. కనీసం విమర్శ చేయడానికైనా బుద్ధి ఉండాలన్నారు. ఈ విషయంపై సభా సాక్షిగా అడుగగా..ఇవ్వలేదని లబ్ధిదారులు తెలిపారు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో బాన్సువాడ నియోజకవర్గానికి వెయ్యి ట్రాక్టర్లను అందించానని, తాను సైతం ఒక్కో ట్రాక్టర్కు లక్ష రూపాయలను తీసుకున్నట్లు ఆరోపణలు చేశారన్నారు. తాను అందరిలా చేస్తే నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచేవాడిని కాదన్నారు.
నోరు ఉంది కదా అని ఏదైనా విమర్శిస్తే పో తుందిలే అనుకుంటే తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వానకాలం దృష్టిలో పెట్టుకొని భైరాపూర్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టేందుకు ఇసుకను, నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామ శివారులో నిర్మిస్తున్న బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం, బాన్సువాడ పట్టణంలోని బీడీ కార్మికుల కాలనీలో రూ.4 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించేందుకు ఇసుకను తరలించుకొని పెడితే దానిని అమ్ముకునేందుకే తరలించారంటూ ఇతర పార్టీల వారు విమర్శలు చేయడం దారుణమన్నారు.
తమకు కోట్లు అవసరం లేదని, ప్రజలకు సౌకర్యాలను కల్పించడమే తమ తపన అని సభాపతి అన్నారు. కొందరు రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మొరుగుతున్నారని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, దానిలో భాగంగానే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధిలో ముందున్నదని అన్నారు. తెలంగాణలోని పథకాలు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.