బీర్కూర్/బాన్సువాడ, జూన్ 24 : వానకాలం పంటల సాగు కోసం శనివారం నిజాంసాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతుల కోసం శనివారం సాయంత్రం 4 గంటలకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆయకట్టు రైతులకు ఆరు విడుతలుగా నీటిని విడుదల చేస్తామన్నారు. మొదటి విడుత 20 రోజులు, తరువాత మిగిలిన 5 విడుతలు 10 రోజుల చొప్పున నీటిని విడుదల చేయనున్నామని వివరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని రైతులు ఇప్పటికే మోటరు బోర్లు, బావుల వద్ద నార్లు వేసుకున్నారని చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టులో ఒక పంట సాగుకు 9 టీఎంసీల నీరు అవసరమని, ప్రస్తుతం ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఇబ్బందులు ఉండవన్నారు. అత్యవసరమైతే సింగూర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ద్వారా కూడా నీళ్లు అందుతాయన్నారు. నీరు వృథా కాకుండా ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద వీఆర్ఏ, వీఆర్వో, గ్రామ పోలీసు అధికారితో కూడిన బృందాలు కాపలాగా ఉండాలన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని స్పీకర్ సూచించారు.
రోడ్లపై కేజ్వీల్ ట్రాక్టర్లు నడిపితే కేసులు నమోదుచేయాలి
కేజ్వీల్ ట్రాక్టర్లను రోడ్లపై ఎట్టి పరిస్థితిలోనూ తిరగనివ్వకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్పీకర్ సూచించా రు. కేజ్వీల్ ట్రాక్టర్లు నడుపడంతో కోట్ల రూపాయలతో వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయన్నారు. నిబంధనలను అతిక్రమించిన ట్రాక్టర్లను సీజ్ చేసి, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ , డీఎస్పీ జయపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ వినయ్కుమార్ , నీటి పారుదలశాఖ ఈఈ రమ, డీఈ శ్రావణ్కుమార్ రెడ్డి , రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు గంగాధర్, విఠల్, రాజు పాల్గొన్నారు.