భీమ్గల్/మోర్తాడ్, జూన్ 18: ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. భీమ్గల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎటు చూసిన డబుల్రోడ్లు, డివైడర్లు, వాగుల్లో చెక్డ్యాంలు, వంద పడకల దవాఖాన.. ఇలా ఎన్నో మంజూరు చేయించారని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని చెప్పారు. ఆర్మూర్కు వంద పడకల దవాఖాన తీసుకురావడం, అందులో ఇప్పటి వరకు 20వేలకు పైగా ఉచితంగా డెలివరీలు చేయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకే దక్కుతుందని చెప్పారు. మంత్రి ప్రశాంత్రెడ్డిని మరోసారి ఇక్కడి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
నెరవేరిన మూడు తరాల కల..
– డాక్టర్ మధుశేఖర్
భీమ్గల్కు వంద పడకల దవాఖాన రావడంతో మూడు తరాల కల నెరవేరిందని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రశాంత్రెడ్డి, హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని పార్టీలు మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని, టీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధే అభిమతంగా పనిచేస్తున్నదని చెప్పారు. ప్రశాంత్రెడ్డికి మరోసారి మద్దతు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి, రాష్ట్ర ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీగౌడ్, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్రావు, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, జిల్లాగ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నెప్రేమలతా సురేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ముత్తెన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మనాయక్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయీజ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బైక్ర్యాలీతో ఘనస్వాగతం..
భీమ్గల్కు వచ్చిన మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డికి యువకులు బైక్ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. భూమిపూజ నిర్వహించిన స్థలం నుంచి సభాప్రాంగణం వరకు సుమారు రెండుకిలో మీటర్ల వరకు రెండువేల బైక్లతో ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో మంత్రులపై పూలవర్షం కురిపించారు.
వేములపై మంత్రి హరీశ్ ప్రశంసల జల్లు..
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంత్రి వేములపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే నాయకుడు ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 24 చెక్డ్యాంలు కట్టించిన ఘనత ఆయనదని, నియోజకవర్గ ప్రజలకు నీటి గోస తీర్చారన్నారు. స్వర్గీయ వేముల సురేందర్రెడ్డితో నాకు ఉద్యమ అనుబంధం ఉన్నదని మంత్రి హరీశ్ గుర్తు చేసుకున్నారు. ఎదిగిన లీడర్ ప్రశాంత్రెడ్డిని బాల్కొండ ప్రజలు కాపాడుకోవాలని సూచించారు.
మోతెలో మంత్రులకు ఘనస్వాగతం..
వేల్పూర్, జూన్ 18: పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం మోతె గ్రామానికి వచ్చిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి ఓపెన్ టాప్ జీపులో మంత్రులు ఊరేగింపుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రాంతానికి చేరుకున్నారు. మంత్రులకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
మండలంలోని మోతె గ్రామంలో రూ.కోటీ 30 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ.కోటితో బైపాస్ రోడ్డు పనులకు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. మోతె గ్రామం నుంచి పచ్చలనడ్కుడ గ్రామం వరకు రూ. 60 లక్షలతో నూతనంగా చేపడుతున్న రోడ్డు పనులను వారు ప్రారంభించారు.
కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, పోచారం సురేందర్రెడ్డి, కోటపాటి నర్సింహ నాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు తీగల రాధ, రజిత, గంగారెడ్డి, రమేశ్, సుధాకర్ గౌడ్, నితీశ్ కుమార్, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీపీ భీమ జమున, పార్టీ వేల్పూర్ మండల కన్వీనర్ నాగధర్, సొసైటీ చైర్మన్లు మోహన్రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖాన పరిశీలన..
వేల్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు సందర్శించారు. దవాఖానలో రోగులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. పలువురు రోగులతో ఆయన మాట్లాడారు. దవాఖానను స్నేహితుల సహకారంతో కార్పొరేట్ వైద్యశాల మాదిరిగా తీర్చిదిద్దిన ప్రశాంత్రెడ్డిని అభినందించారు.