నిజామాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. చౌడమ్మ ఆలయం సమీపంలో రహదారి పక్కనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ కుమార్ దంపతులు సొంత ఖర్చుతో నిర్మించిన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల పాటు ధార్మిక క్రతువులను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీలక్ష్మీ నరసింహ ఉపాసకులు శ్రీవేదాల భార్గవ నరసింహ స్వామి ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్రం అనుసరించి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయ నూతన నిర్మాణ ప్రదేశంలో యాగశాలలను నిర్మించారు.
రుత్వికులు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి కవిత, అనిల్ దంపతులు పలువురికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. ఈ మేరకు భారీగా జనాలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీవిష్వక్సేనారాధన పుణ్యహ వాచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, మృత్సంగ్రహణ, అంకురార్పణ, చతుస్థానార్చన అధివాసాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనములు, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు..
చౌడమ్మ కొండూర్లో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవనపల్లి వంశీయులకు ఇలవేల్పు. చాలా ఏండ్లుగా ఈ కుటుంబసభ్యులు సీహెచ్ కొండూర్లోని నరసింహ స్వామిని కొలుస్తున్నారు. నవీపేట మండలం పోతంగల్లో నివసిస్తున్న దేవనపల్లి కుటుంబాలు సైతం నిత్యం నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్కు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. తమ ఇంటి దేవుడికి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో దేవనపల్లి కుటుంబీకులు ఈ మహా క్రతువుకు ముందడుగు వేశారు. అనుకున్నదే తడవుగా చకచకా నిర్మాణ పనులను షురూ చేసి ఏడాది కాలంలోపే అందమైన దేవాలయాన్ని నిర్మించారు. చారిత్రక చౌడమ్మ దేవాలయం సమీపంలోనే శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారు. సుమారు మూడున్నర వేల గజాల స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. అధునాతన సౌకర్యాలతోపాటు దేవాలయం అంతర్భాగంలో ఆధ్యాత్మిక చింతన స్పృశించేలా అందంగా తీర్చిదిద్దారు.
పోతంగల్ నుంచి భారీ ర్యాలీ
నవీపేట, జూన్ 3: లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పోతంగల్ నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వ నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోతంగల్లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు.