ఖలీల్వాడి/నిజామాబాద్ రూరల్, మే 22 : సామాజిక ఉద్యమకారుడు, సాహితీవేత్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంత్యుత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి, మహిళలకు విద్యనందించేందుకు భాగ్యరెడ్డివర్మ చేసిన కృషిని గుర్తు చేశారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తంచేశారు. మహనీయుల జయంత్యుత్సవాలు వారిని స్మరించుకోవడంతోపాటు స్ఫూర్తి పొందేందుకు దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు. దళిత బాలికల కోసం హైదరాబాద్ సంస్థానంలో 1906-1933 మధ్య 26 పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. దళిత వైతాళికుడిగా పేరుగాంచిన భాగ్యరెడ్డివర్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, కలెక్టరేట్ ఏవో సుదర్శన్, అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ మండలం గూపన్పల్లి జడ్పీహెచ్ఎస్లో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి హెచ్ఎం శకుంతలాదేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు భాగ్యరెడ్డివర్మ ఎంతో కృషి చేశారని, అంటరానితనం, దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారని గుర్తుచేశారు. తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ.. సమాజ చైతన్యం కోసం భాగ్యరెడ్డివర్మ 3,348 ఉపన్యాసాలు, ప్రముఖ పత్రికల్లో వ్యా సాలు రాశారని తెలిపారు. సమ సమాజం కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీరామ్లక్ష్మణ్, స్వప్న, అంజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.