ఎడపల్లి (శక్కర్నగర్), మే 22: ఎడపల్లి మండలంలోని మంగళ్పాడ్ చెరువుకట్టపై నిర్మించిన శివగంగమ్మ ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం ప్రారంభించారు. ఉత్సవాలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఆదివారం విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమాలకు మల్లారం లింగేశ్వరాలయం వ్యవస్థాపకుడు బాలయోగి పిట్ల కృష్ణ మహరాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవనామ స్మరణకు నిత్యం కొంత సమయం కేటాయించాలని సూచించారు. వేద పండితులు సాంబశివరావు జోషి, రాజేశ్ జోషి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమాల్లో సర్పంచ్ బట్టు హన్మాండ్లు, గంగపుత్ర సంఘం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం..
బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం పలు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి రెండు గంటల పాటు స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం హవనం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం విశేష కార్యక్రమాలను హైదరాబాద్కు చెందిన రాఘవాచారి బృందం ఆధ్వర్యంలో జరిపించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.
మెండోరాలో పెద్దమ్మ పండుగ..
మెండోరా, మే 22: మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నుంచి నీటిని తీసుకవచ్చి పెద్దమ్మ ఆలయంలో జలాభిషేకం చేశారు. అనంతరం భక్తులు వనభోజనాలకు తరలివెళ్లారు.
గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు..
భీమ్గల్, మే 22: పట్టణంలోని గ్రామ దేవతలకు భక్తులు ఆదివారం మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో పోశమ్మకు బోనాలను సమర్పించారు. పిల్లా పాపలు, పాడి, పంటలను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చేశారు.