ఖలీల్వాడి, మే 20 : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా తొలివిడుతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని, పల్లెప్రగతికి సమగ్ర ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా మన ఊరు.. మన బడి, పల్లెప్రగతి, హరితహారం, వానకాలం పంటల సాగుకు సన్నద్ధత, ధరణి తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. మన ఊరు.. మన బడి ద్వారా 115 పాఠశాలలకు ముందస్తుగానే నిధులు విడుదల చేసినట్లు తెలిపా రు. పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు మం చి వాతావరణాన్ని నెలకొల్పితే విద్యార్థులు చక్కగా చదువుకుంటారన్నారు. సేవా దృక్పథంతో విధులను నిర్వర్తించాలని అధికారులకు హితవు పలికారు. ఇప్పటి వరకు అంచనా నివేదికలను అందించని పాఠశాలలు సోమవారంలోగా అందించాల ని సూచించారు. మన ఊరు.. మనబడి పనులపై ప్రధానంగా తహసీల్దార్లు, ఏఈలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలన్నారు.
వానకాలం పంటలసాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రయోగాత్మకంగా పంటల సాగు కోసం బ్లాక్లను ఎంపిక చేయాలన్నారు. జూన్ 3 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమం కోసం సమగ్ర ప్రణాళికతో సిద్ధమై ఉండాలని ఆదేశించారు. డంపింగ్యార్డులు, కంపోస్ట్ షెడ్డులు, పల్లెప్రకృతి వనం, బృహత్ పల్లెప్రకృతి వనాలు అందుబాటులోకి రావాలన్నారు. చెరువులు, కాలువ గట్టు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీలార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీడీవోలు పల్లెప్రగతి కార్యక్రమాల అమలులో క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో చందర్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టైలరింగ్ అండ్ గార్మెంట్స్ ప్రారంభం
స్వయం సహాయక సంఘాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహాయసహకారాలను అందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మెప్మా, నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీ హబ్ సహకారంతో నగరంలోని వర్ని రోడ్డులో సెల్ఫ్హెల్ప్ గ్రూప్ సభ్యులు నూతనంగా నెలకొల్పిన టైలరింగ్ అండ్ గార్మెంట్స్ షాప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా గడిచిన రెండేండ్లు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యాపారాల స్థాపన, విస్తరణపై దృష్టి సారించాలని మహిళా సంఘాలకు సూచించారు. స్వయం సహాయక సంఘాలు ముందుకు వస్తే హాస్టల్ విద్యార్థుల యూనిఫామ్లు కుట్టడంతోపాటు బూట్లు, సాక్సులు, దుప్పట్లు వంటి వస్తువులను కమిషన్ప్రాతిపదికన సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రాములు, టౌన్ ఫ్లానింగ్ అధికారి రమేశ్ పాల్గొన్నారు.