భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలూ దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఇందూరు ఆడబిడ్డలు దూసుకెళ్తున్నారు. అందివచ్చిన అవకాశాలను క్రీడాకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని తమకుతామే సాటిగా నిలుస్తున్నారు. వివక్షను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మెరుస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ చాంపియన్కాగా.. హాకీపై తనదైన ముద్ర వేసిన యెండల సౌందర్య.. చిన్నవయస్సులోనే ఫుట్బాల్ సీనియర్ భారత జట్టులో స్థానం సాధించిన గుగులోత్ సౌమ్య.. ఇలా ఎందరో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నిజామాబాద్ సివంగి.. ప్రపంచ చాంపియన్
ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడి.. పవర్ పంచ్లతో ఉక్కిరిబిక్కిరి చేసి మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్గా నిలిచి ఇందూరు కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తం చేసింది నిఖత్ జరీన్. అంచనాలను అందుకుంటూ.. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సర్వశక్తులూ ఒడ్డి స్వర్ణం తెచ్చింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ పోటీల్లో బలమైన హుక్ షాట్లతో..ప్రత్యర్థికి ఏ అవకాశమూ ఇవ్వకుండా దూకుడుగా ఆడి స్వర్ణభేరి మోగించింది నిజామాబాద్ ముద్దుబిడ్డ. నగరంలోని వినాయక్నగర్కు చెందిన జమీల్ హైమద్, సుల్తానా దంపతుల గారాలపట్టి నిఖత్ జరీన్. 1996 జూన్ 14న జన్మించింది. స్థానిక నిర్మల హృదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నది. పాఠశాలలో నిర్వహించిన ఎస్టీఎఫ్ అథ్లెటిక్స్లో చాంపియన్గా నిలిచింది. ఇదే సమయంలో నిఖత్ అథ్లెటిక్స్లో రాణించడాన్ని చూసిన కోచ్ అన్వర్ మెరుగైన శిక్షణ ఇచ్చాడు. డీఎస్ఏ మైదానంలో అథ్లెటిక్స్ సాధన చేస్తున్న నిఖత్ దృష్టి బాక్సింగ్పై పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాక్సింగ్ నేర్చుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో 13ఏండ్ల వయస్సులో కోచ్ శంషొద్దీన్ వద్ద చేరింది. అక్కడి నుంచి మొదలైన నిఖత్ బాక్సింగ్ పంచ్ల వర్షం అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న ఐదో బాక్సర్గా నిఖత్ చరిత్ర సృష్టించింది.
2011 టర్కీలో జరిగిన ప్రపంచ జూనియర్, యూత్ చాంపియన్షిప్లో స్వర్ణం
2014లో బల్గేరియాలో నిర్వహించిన యూత్ వరల్డ్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్
సెర్బియాలో నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్ మెడల్
2015లో అస్సాంలో నిర్వహించిన 16వ సీనియర్ మహిళల జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్
2016 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం
2018 సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన టోర్నీలో స్వర్ణం
2019 థాయ్లాండ్ ఓపెన్లో రజతం
చిచ్చరపిడుగు… గుగులోత్ సౌమ్య
గ్రౌండ్లో దిగితే చిచ్చరపిడుగే.. పుట్బాల్ క్రీడలో రాణిస్తూ 19ఏండ్లకే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు గుగులోత్ సౌమ్య. 30 ఏండ్ల తర్వాత తెలుగు రాష్ర్టాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. ఫుట్బాల్ జట్టుకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రీడాకారిణి కావడం విశేషం.నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లి(కిషన్తండా)కు చెందిన ధనలక్ష్మి-గోపి దంపతుల కూతురు. 2001 జూలై 18న జన్మించిన గుగులోత్ సౌమ్య నవీపేటలోని శ్రీమాధవి విద్యానికేతన్లో 1-5వ తరగతి వరకు, నిజామాబాద్లోని రాఘవ హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివింది. ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్, కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేసింది. 2012లో కర్నూల్లో నిర్వహించిన అండర్-14 స్కూల్ గేమ్స్ టోర్నీలో పాల్గొన్నది. 2013లో ఏపీ స్టేట్ లెవల్ పోటీల్లో ఆడింది. 2014లో అండర్-17 విభాగంలో కోల్కత్తాలో, 2015లో మణిపూర్,గోవాలో జరిగిన పోటీల్లో మెరిట్ సాధించింది. నేపాల్, ఒడిశా, అండమాన్ నికోబార్, పాండిచ్చేరిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నది. 2016లో చైనాలో జరిగిన ఏఎఫ్సీ అండర్-16పోటీల్లో, మయన్మార్లో అండర్-19 విభాగంలో ప్రతిభ చాటింది. ఏఎఫ్సీ అండర్- 19 హోనాలి, 2017లో జమ్మూకశ్మీర్, సౌత్ఆఫ్రికాలో నిర్వహించిన బీఆర్ఐసీఎస్ అండర్- 17 టోర్నీలో పాల్గొన్నది. 2018లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మహిళల అండర్-17 బ్రిక్స్ చాంపియన్షిప్లో భారత జట్టుకు సౌమ్య కెప్టెన్గా వ్యవహరించింది. 2020 ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఇండియన్ ఉమెన్స్ లీగ్లో ముంబై జట్టుకు నాయకత్వం వహించిన సౌమ్య.. టీమ్ను సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. సౌమ్య ఇప్పటివరకు 26 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. 2021లో సిల్వర్ మెడల్ సాధించింది.
హాకీ ఆణిముత్యం.. యెండల సౌందర్య
తెలంగాణ నుంచి ఏకైక హాకీ ప్లేయర్గా గుర్తింపు పొందిన యెండల సౌందర్య.. భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సౌందర్య హాకీలో అంచెలంచెలుగా ఎదిగింది. నిజామాబాద్కు చెందిన చంద్రకళ-సాయిలు దంపతులకు 2003లో సౌందర్య జన్మించింది. 11ఏండ్ల వయస్సులోనే మక్బూల్ అహ్మద్ వద్ద కోచింగ్ తీసుకున్నది. 2005 నుంచి 2009 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్లోరియా ఫిలైలో పాల్గొన్నది. 2006 జూనియర్ ఇండియన్ క్యాంప్లో అవకాశం వచ్చింది. జపాన్లో 2006 ఇంటర్నేషనల్ టోర్నీ, 2008లో మలేషియాలో నిర్వహించిన జూనియర్ ఏషియన్ కప్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2009లో జూనియర్ హాకీ వరల్డ్ కప్లో, 2010లో సీనియర్ హాకీ వరల్డ్కప్లో ఆడింది. ఏకంగా 100 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. భారత జట్టుకు అనేక విజయాలను సాధించిపెట్టింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుం చి ఉన్నతస్థాయికి చేరుకున్న సౌందర్య పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమైంది. ప్రస్తుతం భారత హాకీ మహిళల జూనియర్ జట్టుకు కోచ్గా పని చేస్తున్నది. ఆమె ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, హాకీలో రాణించిన తీరు నేటి తరానికి ఆదర్శం.
చిన్నప్పటి నుంచి పట్టుదలతో..
నిఖత్ జరీన్ చిన్నప్పటి నుంచి పట్టుదలతో ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బాక్సింగ్ను వదలకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించింది. జిల్లాలో మెరిసిన ఆణిముత్యం. ఇలాంటి వాళ్లని ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంది నిఖత్ జరీన్లు పుట్టుకొస్తారు.
– సయ్యద్ కైసర్, అథ్లెటిక్స్ కోచ్
దేశానికి గర్వకారణం..
నిజామాబాద్లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా జిల్లాకు పేరుతేవడం అందరి అదృష్టం. దేశానికే గర్వకారణం. క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంది క్రీడాకారులు ప్రపంచస్థాయిలో రాణిస్తారు.
– ఎస్తామొద్దీన్, బాక్సింగ్ సర్వీసెస్ ఇండియా
జిల్లా పేరు నిలబెట్టింది..
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించి జిల్లా పేరు నిలబెట్టింది. నిఖత్ ఆటతీరు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నది. నిజామాబాద్ గడ్డపై ఎన్నో మెళకువలు నేర్చుకొని ప్రపంచస్థాయిలో బంగారు పతకం సాధించడం గొప్ప విశేషం.
– గడీల శ్రీరాములు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు